ద‌ర్శ‌కుడి డేరింగ్ స్టేట్మెంట్

తెలుగు సినిమాల్లో ప‌రభాషా న‌టుల ఆధిప‌త్యం గురించి కోట శ్రీనివాస‌రావు లాంటి పెద్దోళ్లు అప్పుడ‌ప్పుడూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు. ఫ‌లానా పాత్ర‌కు ఫ‌లానా న‌టుడే సూట‌వుతాడు అనుకున్న‌పుడు వేరే భాష‌ల నుంచి మంచి ఆర్టిస్టుల‌ను తెచ్చుకోవ‌డంలో త‌ప్పు లేదు కానీ.. ఇక్క‌డ మ‌న‌వాళ్లు బ్ర‌హ్మాండంగా న‌టించ‌గ‌ల పాత్ర‌ల‌ను కూడా ప‌ర భాషా న‌టుల‌తో చేయించ‌డాన్ని కోట లాంటి వాళ్లు త‌ప్పుబ‌డుతుంటారు.

ఐతే మ‌న ద‌గ్గ‌రున్న మంచి న‌టీన‌టుల‌ను ఉప‌యోగించుకోవాల‌ని ద‌ర్శ‌కులు గ‌ట్టిగా అనుకుంటే త‌ప్ప మ‌న వాళ్ల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌దు. ఐతే ప‌లాస 1976 సినిమాతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేసి.. ఇప్పుడు శ్రీదేవి సోడా సెంట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ క‌రుణ్ కుమార్ మాత్రం ఈ విష‌యంలో చాలా ప‌ట్టుద‌ల‌తోనే ఉన్న‌ట్లున్నారు. ఇప్ప‌టిదాకా చేసిన రెండు సినిమాల్లో తెలుగు ఆర్టిస్టుల‌కు పెద్ద పీట వేశారాయ‌న‌. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్లుగా న‌టించిన న‌క్ష‌త్ర, ఆనంది తెలుగ‌మ్మాయిలే. అలాగే విల‌న్ పాత్ర‌లూ తెలుగు వాళ్ల‌తోనే చేయించారు.

ఇక ముందు కూడా ఇదే ఒర‌వ‌డిని కొన‌సాగిస్తాన‌ని.. త‌న సినిమాలో తెలుగు న‌టీన‌టుల‌తోనే తెర‌కెక్కుతాయ‌ని ఆయ‌న డేరింగ్ స్టేట్మెట్ ఇవ్వ‌డం విశేషం. శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్రాన్ని 100 శాతం తెలుగు న‌టీన‌టుల‌తోనే మొద‌లుపెట్టామ‌ని.. ఐతే ఇందులో ఒక విల‌న్‌గా న‌టించిన ఆర్టిస్టుకి క‌రోనా రావ‌డంతో అత‌డి స్థానాన్ని వేరే భాషకు చెందిన‌ న‌టుడితో భ‌ర్తీ చేయాల్సి వ‌చ్చింద‌ని, ఇప్ప‌టిదాకా త‌న చిత్రాల్లో 99 శాతం తెలుగు ఆర్టిస్టులే న‌టించార‌ని కరుణ్ కుమార్ అన్నారు.

ఇక‌ముందు కూడా తెలుగు వాళ్ల‌తోనే సినిమాలు తీస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. మామూలుగా తూర్పుగోదావరి జిల్లా నేప‌థ్యంలో సినిమా అంటే ఒక టెంప్లేట్ స్ట‌యిల్లో ఉండేవ‌ని.. ఐతే శ్రీదేవి సోడా సెంట‌ర్‌లో అలా కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే కమ్యూనిటీస్‌ వాళ్ల మధ్య ఉండే భావోద్వేగాల మధ్య కథ నడుస్తుంద‌ని.. ఆ కథలో భాగంగా ఈ ప్రేమ కథ ఉంటుందని.. కానీ తూర్పు గోదావరి వారిలో కూడా అన్ని రకాల ఎమోషన్లు, భావోద్వేగాలు, వివక్ష, రాజకీయాలు, ఘోరమైన ఉదంతాలు ఉంటాయని ఈ సినిమాలో చూపించిన‌ట్లు క‌రుణ్ కుమార్ వెల్ల‌డించాడు.