చిరంజీవి రోజూ చెక్కులు రాస్తుంటారు-తమ్మారెడ్డి

టాలీవుడ్లో ఎవరి గురించైనా నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తుల్లో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఎంతటి వాళ్లయినా సరే.. తప్పు చేశారనిపిస్తే ఆయన విమర్శించడానికి వెనుకాడరు. అదే సమయంలో మంచి చేసిన వాళ్ల గురించి పొగడ్డానికి కూడా ఆయన ముందుంటారు. కొన్ని సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి మీద కూడా తమ్మారెడ్డి విమర్శలు చేయడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆయనే చిరంజీవి చేస్తున్న మంచి పనుల గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు.

దాసరి మరణానంతరం ఆయన స్థానాన్ని తీసుకోవాలని తనతో సహా చాలామంది కోరగా.. నాకెందుకు నాకెందుకు అంటూ వచ్చారని.. కానీ గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారని.. అద్భుత రీతిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. చిరు సేవా కార్యక్రమాలు ఈ రోజు మొదలుపెట్టినవి కావని.. దశాబ్దాల కిందటే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టారని తమ్మారెడ్డి గుర్తు చేశారు.

కరోనా టైంలో తనే లీడ్ తీసుకుని సినీ కార్మికులకు ఒకటికి మూడుసార్లు సరుకులు పంపిణి చేశారని.. అలాగే వ్యక్తిగతంగా ఎంతోమందికి సాయపడ్డారని తమ్మారెడ్డి అన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం కూడా చాలానే ఖర్చు చేశారని.. ఇవన్నీ కాకుండా చిరు రోజూ చేసే సాయం ఎవరూ ఊహించలేని స్థాయిలో ఉంటుందని తమ్మారెడ్డి తెలిపారు. ప్రతి రోజూ ఆయన నాలుగైదు లక్షలు దానం చేస్తుంటారని.. సాయం కోరి తనను కలిసే వారిని ఆదుకునేందుకు లక్ష, రెండు లక్షలకు చెక్కులు రాస్తూనే ఉంటారని.. ఇలా చేసిన దానాల గురించి చిరంజీవి అసలు పబ్లిసిటీ చేసుకోరని.. ఈ విషయాలు చాలామందికి తెలియవని తమ్మారెడ్డి అన్నారు.

చిరంజీవి ఒక్కరే దానం చేస్తున్నారని అననని.. చాలామంది సాయాలు చేస్తున్నారని.. కానీ చిరు చేసే సాయాలు చాలా పెద్దవని.. చాలామంది తెలుగు ఇండస్ట్రీ ఏం చేస్తోంది.. నిద్ర పోతోందా అంటుంటారని.. అలాంటి వాళ్లకు సమాధానం చెప్పడానికే ఇప్పుడీ విషయాలు వెల్లడించాల్సి వస్తోందని తమ్మారెడ్డి తెలిపారు.