బెయిల్ పై పెరుగుతున్న ఉత్కంఠ

బెయిల్ రద్దుపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ ను రద్దుచేయాలంటు వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు వేసిన పిటీషన్ పై ఈరోజు సీబీఐ కోర్టు తీర్పు చెప్పబోతోంది. ఈ కేసుకు సంబంధించిన వాద, ప్రతిపాదనలను కోర్టు జూలైలోనే ముగించింది. బెయిల్ రద్దుచేసి ఎలాగైనా జగన్ను జైలుకు పంపాలన్నది తిరుగుబాటు ఎంపి పట్టుదలగా ఉంది.

జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారని, సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని, భయపడెతున్నారంటు పదే పదే రఘురామ ఆరోపణలు చేస్తున్నారు. అయితే తన ఆరోపణలకు తగ్గ సాక్ష్యాలను మాత్రం ఎక్కడ చూపలేదు. బెయిల్ షరతులను జగన్ ఎలా ఉల్లంఘిస్తున్నారో కూడా చెప్పలేకపోయారు. తన బెయిల్ ను కంటిన్యు చేయాలని జగన్ వాదిస్తున్నారు. సాక్ష్యులను ప్రభావితం చేయలేదని జగన్ చెబుతున్నారు.

ఈ మొత్తంలో గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ సాక్ష్యులను ప్రభావితం చేశారా ? లేదా ? ప్రలోభాలకు గురిచేశారా అనే విషయాన్ని తేల్చాల్సింది సీబీఐ అధికారులే. సాక్ష్యులను ప్రభావితం చేసినట్లు, ప్రలోభాలకు గురిచేసినట్లు సీబీఐ ఎక్కడా చెప్పలేదు. నిజానికి జగన్ బెయిల్ విషయంలో అభ్యంతరం చెప్పాల్సిందే సీబీఐ. కానీ సీబీఐ అభ్యంతరాలు చెప్పకపోయినా కేసులతో కానీ విచారణతో కానీ ఎలాంటి సంబంధంలేని రఘురామ బెయిల్ రద్దుకు పిటీషన్ వేయటమే విచిత్రం.

సరే ఆ దశలన్నీ దాటిపోయి చివరకు తీర్పు చెప్పేరోజు వచ్చేసింది. సో సీబీఐ ప్రత్యేక కోర్టు ఏమని తీర్పు చెబుతుందా అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. బెయిల్ రద్దయితే ఏమవుతుంది ? అనే విషయమై రాజకీయపార్టీలతో పాటు జనాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. తన పిటీషన్ను కోర్టు కొట్టేస్తే తాను హైకోర్టుకు అవసరమైతే సుప్రింకోర్టుకు వెళటానికి రెడీగా ఉన్నట్లు తిరుగుబాటు ఎంపి గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. మరి కోర్టు ఏమని తీర్పుచెబుతుందో చూద్దాం.