ప్రైవేటుపరం అవుతున్న ప్రభుత్వాస్తులు

నిధుల సమీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేస్తోంది. దీనికి ముద్దుగా మానిటైజేషన్ అనే పేరు పెట్టింది. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ అన్నా మానిటైజేషన్ అన్నా జరిగేది ప్రైవేటు సంస్థలకు అప్పగించేయటమే. కాకపోతే కొన్నింటిని డైరెక్టుగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తారు. మరికొన్నింటిని పరోక్షంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో రు. 6 లక్షల కోట్లు సమీకరించటమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

విచిత్రమేమిటంటే ఆస్తులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయట. వాటి నిర్వహణ మాత్రమే ప్రైవేటువ్యక్తుల చేతిలో ఉంటాయట. ఇదెలా సాధ్యమో అర్ధంకాక జనాలు బుర్రలు గోక్కుంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలనైనా, ప్రభుత్వ ఆస్తులను అయినా పూర్తిగా యాజమాన్య హక్కులు కల్పిస్తేనే వాటిని తీసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తారు. లేకపోతే తర్వాత తలెత్తే పరిణామాలను భరించేందుకు వాళ్ళకేమి అవసరం.

రోడ్డు, రైళ్లు, విద్యుత్ సంస్థలు, మైనింగ్, గ్యాస్ పైప్ లైన్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు లాంటి చాలా వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిం చేయబోతున్నారు. ఇప్పటికే సుమారు 100 సంస్ధలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దానికి అదనంగా పైన చెప్పిన రంగాల్లోని సంస్ధలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు. దీనిలో భాగంగానే ఏపిలోని విశాఖపట్నలోని పోర్టు బెర్తులు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు తొందరలోనే ప్రైవేటుపరం అయిపోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం బయటకు ఏది చెబితే జనాలు దాన్ని నమ్మాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వాలు పైకి ఒకటిచెప్పి లోలోపల మరోటి చేస్తుంటాయి. ప్రైవేటువ్యక్తులతో చేసుకునే ఒప్పందాలను ప్రభుత్వాలు బయటపెట్టవు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో సంస్ధలను పెట్టినపుడు లీజు కాలపరిమితి ఏ 33 ఏళ్ళనో లేకపోతే 99 ఏళ్ళనో గడువు పెట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాలను జనాలు మరచిపోతారు, ప్రభుత్వం కూడా తర్వాత వాటి జోలికి వెళ్ళవు. మొత్తానికి కారణం ఏదైనా, మార్గమేదైనా ప్రభుత్వ సంస్థలను నరేంద్రమోడి తెగనమ్మేస్తున్నది వాస్తవం.