రేవంత్ హెచ్చ‌రిక‌లు.. సీనియ‌ర్ల‌కేనా!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి దూకుడు మ‌రోస్థాయికి చేరింది. ఓ వైపు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌దునైన విమ‌ర్శ‌లు చేస్తూ.. స‌భ‌లు, ర్యాలీలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందే దిశ‌గా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. మ‌రోవైపు పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. పార్టీలో ప‌నిచేసే యువ‌కుల‌కే ప్రాధాన్య‌త ఉంటుంద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్ల‌కే టికెట్లు ద‌క్కుతాయ‌ని స్ప‌ష్టం చేసిన రేవంత్‌.. ప‌రోక్షంగానే పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకునే ఈ వ్యాఖ్య‌లు చేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కాన్ని మొద‌టి నుంచి ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ల్లో కొంత‌మంది వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. అయినా రేవంత్‌పై న‌మ్మ‌కం పెట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం అత‌ని చేతికే టీపీసీసీ ప‌గ్గాలు అందించింది. దీంతో అప్ప‌టి నుంచి కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల ఇంద్ర‌వెల్లిలో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌కు టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్రెడ్డి, ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి, సీనియ‌ర్ నాయ‌కుడు హ‌నుమంత‌రావు హాజ‌రు కాలేదు.

ఈ స‌భ‌కు రాని వాళ్లంద‌రూ కేసీఆర్ కోవ‌ర్టులే అనే అర్థం వ‌చ్చేలా ఇప్ప‌టికే వ్యాఖ్య‌లు చేసిన రేవంత్‌.. తాజాగా సీనియ‌ర్ల‌పై ప‌రోక్షంగా తీవ్రంగా మండిప‌డ్డారు. జ‌ట్టు చెద‌ర‌కుండా చేతుల‌కు మ‌ట్టి అంట‌కుండా ప‌నిచేస్తున్న‌ట్లు న‌టించే నాయ‌కుల‌కు అవ‌కాశాలు రావ‌ని ఇప్ప‌టి నుంచి 20 నెల‌లు నిస్వార్థంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన వారికే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసిన రేవంత్ వ్యాఖ్య‌లు పార్టీలో అధికారం కోసం పాకులాడ‌డమే త‌ప్ప ఆ దిశ‌గా ఎలాంటి విధంగానూ శ్ర‌మించిన సీనియ‌ర్ నేత‌లే ల‌క్ష్యంగా చేసుకున్న‌ట్లు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే వ‌చ్చే నెల‌లో ఓ స‌భ కోసం కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ర‌ప్పించేందుకు రంగం సిద్ధం చేసుకున్న రేవంత్‌.. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌తో త‌న ఉద్దేశాన్ని బ‌ల్ల‌గుద్దిన‌ట్లు చెప్పారని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.