పాపం.. ఉన్న క‌ష్టాలు చాల‌వ‌ని

క‌రోనాతో అన్ని భాష‌ల‌ సినిమా ప‌రిశ్ర‌మ‌లూ గ‌ట్టి దెబ్బ‌లే తిన్నాయి కానీ.. బాలీవుడ్‌కు త‌గిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌కు మ‌ధ్య‌లో తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ మోస్త‌రుగానే కోలుకున్నాయి. ఇక్క‌డ రిలీజైన సినిమాలు బాగానే ఆడాయి. వ‌సూళ్లు రాబ‌ట్టాయి. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ ప‌రిస్థితి లేదు. ఏదో నామ‌మాత్రంగా కొన్ని చిత్రాలు రిలీజ‌య్యాయి. అవేవీ ఆశించిన ఫ‌లితాల‌నివ్వ‌లేదు. ఉత్త‌రాదిన చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగాయి.

ఇంతలోనే సెకండ్ వేవ్ వ‌చ్చి మ‌రోసారి థియేట‌ర్ల‌ను మూత వేయించింది. మ‌ళ్లీ ఇప్ప‌టిదాకా ఉత్త‌రాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేట‌ర్లు తెరుచుకోలేదు. అయినా స‌రే.. ధైర్యం చేసి అక్ష‌య్ కుమార్ సినిమా బెల్ బాట‌మ్‌ను ఈ గురువారం రిలీజ్ చేశారు. బాలీవుడ్‌కు కేంద్ర‌మైన ముంబ‌యిలో థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌గా ఈ సినిమా రిలీజ‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డే కాక ఉత్త‌రాదిన మ‌రి కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతుండ‌టంతో ఓపెనింగ్స్‌పై బాగా ప్ర‌భావం ప‌డింది.

తొలి రోజు అక్ష‌య్ సినిమాలు ఇండియాలో దాదాపు 20 కోట్లు వ‌సూలు చేస్తాయి మామూలుగా. కానీ ఈ చిత్రానికి మూడు కోట్ల లోపే నెట్ వ‌సూళ్లు వ‌చ్చాయి. సినిమాకు యావ‌రేజ్ టాక్ ఉండ‌టం, థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు, జ‌నాలు ఇంకా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసే మూడ్‌లోకి రాక‌పోవ‌డం ఇందుక్కార‌ణం.

ఇంత‌టి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత‌ల‌కు ఇంకో పెద్ద కష్టం వ‌చ్చి ప‌డింది. రిలీజ్ రోజే బెల్‌బాట‌మ్ ఆన్ లైన్లోకి వ‌చ్చేసింది. త‌మిళ్ రాక‌ర్స్, ఫిల్మీవ్యాప్ లాంటి పైర‌సీ వెబ్ సైట్ల‌లో ఈ చిత్రాన్ని లీక్ చేసేశారు. మంచి ప్రింట్ అందుబాటులోకి రావ‌డంతో ఇక ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఏం సినిమా చూస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ చేయడానికి మిగ‌తా నిర్మాత‌లు ఏం ధైర్యం చేస్తారు?