హుజూరాబాద్‌లో వేడి చ‌ల్ల‌బ‌డిందా?

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి హుజూరాబాద్‌లో మొద‌లైన వేడి ఇప్పుడు కాస్త చ‌ల్ల‌బ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాల‌కు వేదికైన ఈ హుజూరాబాద్ ఎన్నికలో విజ‌యం అధికార టీఆర్ఎస్ పార్టీ, ఈట‌ల గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో నోటిఫికేష‌న్ రాక‌పోయిన‌ప్ప‌టికీ గ‌త కొన్ని నెల‌లుగా అక్కడ రాజ‌కీయ వేడి కొన‌సాగింది. ఈట‌ల పాద‌యాత్ర‌, కాంగ్రెస్‌కు రాజీనామ చేసిన కౌశిక్ టీఆర్ఎస్‌లో చేర‌డం, త‌మ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్‌ను కేసీఆర్ ఖ‌రారు చేయ‌డం, ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ రావ‌డం.. ఇలా అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కింది.

కానీ ఇప్పుడు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ సంద‌డి క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌ట్లో నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని వాస్త‌వ ప‌రిస్థితి అర్థం చేసుకున్న రాజ‌కీయ పార్టీలు నెమ్మ‌దించాయి. అంద‌రూ ప్రెస్‌మీట్ల‌తోనే స‌రిపెడుతున్నారు. మొన్న‌టివ‌ర‌కూ హోరెత్తిన ప్ర‌చారం ఇప్పుడు మూగ‌బోయింది. ఎక్క‌డ చూసినా పార్టీ జెండాలు క‌నిపిస్తున్నాయి కానీ నేత‌ల ప్ర‌చారం మాత్రం లేదు. కేసీఆర్ ద‌ళిత బంధు ప్రారంభించిన త‌ర్వాత నాయ‌కులంతా హైద‌రాబాద్ వెళ్లిపోయారు. ఈ ఉప ఎన్నిక‌లో పార్టీని గెలిపించే బాధ్య‌త తీసుకున్న హ‌రీష్ రావు కూడా ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ హైద‌రాబాద్ నుంచే కార్య‌క‌లాపాలు చ‌క్క‌బెట్ట‌నున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో నియ‌మించిన ఇంచార్జులు కూడా సొంత ఊళ్ల బాట ప‌ట్టారు.

మ‌రోవైపు పాదయాత్ర ప్రారంభించి మ‌ధ్య‌లో మోకాలికి శ‌స్త్రచికిత్స కార‌ణంగా విరామం తీసుకున్న ఈట‌ల కూడా నెమ్మ‌దించిన‌ట్లే క‌నిపిస్తోంది. ఆయ‌న కూడా ప్ర‌చారాన్ని పూర్తిగా త‌గ్గించారు. ఆయ‌న భార్య జ‌మున కూడా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థిని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. మాజీ మంత్రి కొండా సురేఖ‌ను బ‌రిలో దింప‌డం దాదాపు ఖాయ‌మైన‌ప్ప‌టికీ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈ లోగా కొంత‌మంది నేత‌లు ద‌ళిత మాదిగ నాయ‌కుడికి టికెట్ ఇవ్వాల‌ని మాణిగం ఠాగూర్‌ను క‌లిసి విన్న‌వించారు. దీంతో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చిన త‌ర్వాతే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌నేది కాంగ్రెస్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.