అందుకే రాహుల్ గాంధీని తీసుకొస్తానంటున్న రేవంత్‌

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత ఎంపీ రేవంత్ రెడ్డి య‌మ జోరుమీదున్నారు. అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ల‌క్ష్యంగా చేసుకుని ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల్లో వేడి పుట్టించ‌డంతో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణుల్లో స‌రికొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. స‌భలు, ర్యాలీల‌తో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. ఇలా వివిధ ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న రేవంత్‌కు సొంత పార్టీ సీనియ‌ర్ల నుంచి మాత్రం ఇప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మ‌ద్ద‌తు దొర‌క‌డం లేద‌నేది కాద‌న‌లేని వాస్త‌వ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ నియామ‌కాన్ని మొద‌టి నుంచి వ్య‌తిరేకించిన పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, స‌భ‌లకు దూరంగానే ఉంటున్నారు. అయితే వీళ్ల‌ను దారిలోకి తెచ్చుకునేందుకు రేవంత్ ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేశాడ‌ని స‌మాచారం.

ద‌ళిత‌, గిరిజ‌న దండోరా స‌భ‌ను ఉమ్మ‌డి జిల్లాల్లో నిర్వ‌హించేందుకు శ్రీకారం చుట్టిన రేవంత్ వ‌రంగ‌ల్ దండోరా స‌భ‌కు ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ర‌ప్పిస్తున్నారు. వ‌చ్చే నెల 10 నుంచి 17లోపు రాహుల్ ప‌ర్య‌ట‌న ఉండేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ కూడా ధృవీక‌రించారు. రాహుల్ గాంధీని ర‌ప్పించ‌డం ద్వారా రేవంత్‌కు రెండు ర‌కాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లిగే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు. త‌న బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించుకునేందుకు ఈ స‌భ ఆయ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌నుంది. అదే స‌మ‌యంలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న కాస్తో కూస్తో ఆద‌ర‌ణ‌ను పెంచుకునే వీలుంది.

మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీలోని రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కుల‌నూ దారిలోకి తెచ్చుకునేందు ఇది రేవంత్‌కు స‌రైన వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్య‌క్షుడు అయ్యాక రేవంత్‌తో క‌లిసి వ‌చ్చేందుకు కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు సంసిద్ధంగా లేర‌నే వార్త‌లు వ‌చ్చాయి. కోమ‌టిరెడ్డి, జ‌గ్గారెడ్డి, ఉత్త‌మ కుమార్ రెడ్డి లాంటి నాయ‌కులు ఇంకా రేవంత్‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ఆసక్తి చూపించ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు, స‌మావేశాల‌కు, స‌భ‌ల‌కు వాళ్లు దూరంగా ఉంటున్నారు.

ఇప్పుడు రాహుల్ గాంధీ వ‌రంగల్ వ‌స్తే ఈ నాయ‌కులంతా త‌ప్ప‌నిస‌రిగా స‌భ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఇలా సీనియ‌ర్ల‌పై రేవంత్ పైచేయి సాధించిన‌ట్ల‌వుతుంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంటున్నారు. దీంతో రాహుల్ గాంధీ స‌భ‌తో ఇటు రాజ‌కీయంగా బ‌ల‌ప‌డ‌డంతో పాటు అటు పార్టీలోనూ మ‌రింత ప‌ట్టు పెంచుకునే దిశ‌గా రేవంత్ వ్యూహం ర‌చించార‌ని టాక్‌.