రాజీనామా ప్రచారంపై గోరంట్ల ఫస్ట్ రియాక్షన్ ఇదే

టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గోరంట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులు కలిసి మాట్లాడారు. కొంద‌రితో త‌న‌కు ఇబ్బందులున్న‌ట్టు గోరంట్ల త‌మ దృష్టికి తెచ్చార‌ని, కానీ, ఆయన రాజీనామా చేయబోరని అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి చిన‌రాజ‌ప్ప మీడియాకు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో వారిద్దరి వ్యాఖ్యల తర్వాత తన రాజీనామాపై గోరంట్ల స్పందించారు. త్వ‌ర‌లో త‌న అభిప్రాయాన్ని బ‌హిరంగంగా ప్ర‌క‌టిస్తాన‌ని , ప్రస్తుతానికి తానేమీ మాట్లాడనని చెప్పారు. ఆత్మగౌరవ నినాదంతో అన్నగారు పెట్టిన పార్టీలో ఆయన వెన్నంటి నడిచానని, త‌న‌కు ఆత్మ‌గౌర‌వం ముఖ్య‌మ‌ని అన్నారు. దాని కోస‌మే బ‌తుకుతున్న‌ానని, అది లేన‌ప్పుడు సరైన నిర్ణ‌యం తీసుకుంటాన‌ని గోరంట్ల తన రాజీనామాపై నర్మగర్భ వ్యాఖ్య‌లు చేశారు.

తాను చంద్ర‌బాబును క‌లవబోనని, త‌న‌ను క‌లిసి చ‌ర్చించిన వారు అధినేత‌ను క‌లిసి త‌న అభిప్రాయాల‌ను వివ‌రిస్తార‌ని చెప్పారు. పార్టీ న‌డ‌ప‌డంపై లోపాలున్నాయ‌ని గోరంట్ల తెలిపారు. పార్టీని బ‌తికించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను పార్టీ దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు. తన నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో ప్రకటిస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. 30 ఏళ్లుగా టీడీపీతో అనుబంధం ఉందని, ఆత్మగౌరవం కోసమే పోరాటం చేస్తానని వెల్లడించారు.

అంతకుముందు, గోరంట్లకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీపరంగా, రాజకీయపరంగా, గోరంట్లకు ఉన్న ఇబ్బందులపై అరగంటపాటు చర్చించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో తాను వస్తానని, అపుడు అన్ని విషయాలు మాట్లాడతానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, అన్ని విషయాలు సర్దుకుంటాయని బుచ్చయ్యకు చంద్రబాబు నచ్చజెప్పినా…గోరంట్ల వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.