దేశ చరిత్రలోనే తొలిసారిగా.. సీజేఐ గా మహిళ..?

దేశ చరిత్రలోనే తొలిసారిగా.. భారత న్యాయమూర్తిగా ఓ మహిళ నియమితులౌతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అదే నిజమైతే.. భారత న్యాయ వ్యవస్థలోనే ఇది అరుదైన సందర్భం అయ్యే అవకాశం ఉంది. తాజాగా సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తుల నియామ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి కొలీజియం సిఫార‌సులు చేసింది. జాబితాలో ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ ముగ్గురిలో తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లి, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగర‌త్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయని సమాచారం. అయితే కొలీజియం సూచించిన వారిలో జస్టిస్‌ నాగరత్న పేరును గనుక‌ కేంద్రం ఆమోదించి, ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆమె నియామకమైతే.. 2027లో ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

అదే జ‌రిగితే భాత‌ర తొలి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆమె చ‌రిత్ర సృష్టిస్తారు. నాగ‌ర‌త్నం తండ్రి వెంకటరామయ్య కూడా 1989లో సమారు ఆరు నెల‌ల పాటు సుప్రీంకోర్టు సీజేఐగా వ్యవహరించడం గ‌మ‌నార్హం.

ఇక, సుప్రీంకోర్టు జ‌డ్జిలుగా కొలిజియం సిఫారుసులు చేసిన వారిలో మ‌ద్రాస్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్, క‌ర్ణాట‌క హైకోర్టు సీజే ఎస్ ఓకా, సిక్కిం హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, కేర‌ళ హైకోర్టు సీజే పీటీ ర‌వికుమార్, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగార్జున ఉన్నారు. అంతేకాదు, సుప్రీంకోర్టు జ‌డ్జిగా సీనియ‌ర్ న్యాయ‌వాది పీఎస్ న‌ర‌సింహ పేరు కూడా జాబితాలో ఉండ‌టం విశేషం.

వాస్త‌వానికి సుప్రీంకోర్టులో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఒక్క‌సారయినా ఓ మ‌హిళ‌గా ఉండాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. కానీ ఇంత‌వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. గ‌తంలో సీజేఐలుగా ప‌నిచేసిన వారు కూడా మ‌హిళల‌కు ఆ అవ‌కాశం ఇవ్వాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు ఆ డిమాండ్ నెర‌వేరే అవ‌కాశం క‌నిపిస్తోంది.