సమంత-చైతూ.. పెళ్లి జరిగిన చోటే


అక్కినేని నాగచైతన్య-సమంత రూత్ ప్రభుల పెళ్లి జరిగి అప్పుడే నాలుగేళ్లవుతోంది. ఈ జంట గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. సమంతకు అదెంతో నచ్చిన ప్రాంతం. అందుకే ఏరి కోరి అక్కడ పెళ్లి చేసుకుంది. ఎప్పటికైనా గోవాలో స్థిరపడాలని ఉందని కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ కొన్నిసార్లు తన మనసులో మాటను బయటపెట్టింది. ఐతే ఈ దిశగా ఆమె సన్నాహాలు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం.

గోవాలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకునే పనిలో ఇప్పుడు చైతూ-సమంత జోడీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక ప్లేస్ కూడా ఫిక్స్ అయిందని.. అక్కడ ఈ జోడీ ఫామ్ హౌస్ కట్టుకోబోతోందని.. అది గోవా శివార్లలో ఉంటుందని అంటున్నారు. గోవాలో సెటిలవ్వాలనుకుంటున్నట్లు చెబితే.. సినిమాల్లో బిజీగా ఉన్న చైతూ-సమంత ఎప్పటికైనా కూడా అక్కడెలా ఉండగలుగుతుంది అన్న సందేహం కలిగింది అందరికీ.

కానీ చైతూ-సమంత సీరియస్‌గానే గోవాలో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. టాలీవుడ్లో చాలామందికి ఫామ్ హౌస్ అన్నది ఒక కల. ఆ కలను ఎంతోమంది నెరవేర్చుకున్నారు. హైదరాబాద్ శివార్లలో పొలాలు కొనుక్కుని అక్కడ చిన్న ఇల్లు, షెడ్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. మనుషుల్ని పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. వారాంతాల్లో అక్కడికి వెళ్లి ప్రశాంతంగా గడిపి వస్తుంటారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లయితే ఫామ్ హౌస్‌నే పూర్తి స్థాయి ఇల్లుగా చేసుకున్నారు కూడా.

చైతూ-సమంత కూడా ఇలా ముచ్చట తీర్చుకోవాలనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఈ జంట గోవాలో ఫామ్ హౌస్ కొనుక్కుని తమ ప్రత్యేకతను చాటుకోబోతోంది. ప్రస్తుతం చైతూ ‘లవ్ స్టోరి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దాని తర్వాత అతను నటిస్తున్న ‘థ్యాంక్ యు’ సినిమా చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లోనూ అతనో కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. సమంత ఇటీవలే ‘శాకుంతలం’ను పూర్తి చేసి ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైకి వెళ్లింది.