అన్నపూర్ణ స్టూడియోస్.. అనుభవించు రాజా


టాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న బడా బేనర్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు 80వ దశకంలోనే ఈ సంస్థను మొదలుపెట్టి పదుల సంఖ్యలో ఈ బేనర్లో సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున దీని బాధ్యతలు తీసుకున్నారు. తాను హీరోగా చాలా సినిమాలే చేశాడీ సంస్థలో. అంతే కాక కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ చిన్న చిన్న చిత్రాలూ నిర్మించాడీ బేనర్లో. ఉయ్యాల జంపాల ఆ తరహా చిత్రమే. ఐతే దాని తర్వాత అన్నపూర్ణ బేనర్‌కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి.

చివరగా ఈ బేనర్ నుంచి వచ్చిన ‘రంగుల రాట్నం’ విడుదలైన సంగతి కూడా తెలియనంత దారుణమైన ఫలితాన్నందుకుంది. ఐతే దాని హీరో రాజ్‌ తరుణ్‌ను నమ్మి నాగ్ మరోసారి అవకాశం ఇస్తున్నాడు. రాజ్‌తో ఇంతకుముందు ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

అన్నపూర్ణ బేనర్లో రాజ్-శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రానికి ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. దీన్ని బట్టి ఇది పక్కా ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేసేస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఇందులో రాజ్ సరసన కాషిష్ ఖాన్ అనే కొత్తమ్మాయి నటిస్తోంది.

రాజ్ తరుణ్‌తో పాటు శ్రీనివాస్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం. రాజ్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. గత ఏడాది ఓటీటీలో రిలీజైన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓ మోస్తరుగా ఆడింది. దాన్ని కూడా హిట్ అని చెప్పలేం. దానికి ముందు, తర్వాత దరారుణమైన ఫలితాలందుకున్నాడు రాజ్. ‘ఉయ్యాల జంపాల’తో తన కెరీర్‌కు మంచి ఆరంభాన్నిచ్చిన అన్నపూర్ణ స్టూడియోసే ఇప్పుడు తన కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పుతుందని అతను ఆశిస్తున్నాడు.