మోడీ వ్యూహం.. మ‌రో పాతికేళ్లు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఈరోజు చేసిన పంద్రాగ‌స్టు ప్ర‌సంగం ఆద్యంతం… వ్యూహాత్మ‌కంగానే సాగిందని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌ధాని ప్ర‌సంగం యావ‌త్తు.. మ‌రో పాతికేళ్ల పాటు ప్ర‌భుత్వం కొన‌సాగిం చాల‌నే త‌న ల‌క్ష్యాన్ని చాటుకున్న‌ట్టుగా ఉంద‌ని భావిస్తున్నారు. ఆద్యంతం.. త‌న ల‌క్ష్యాన్ని ప్ర‌స్ఫుటంగా వివ‌రించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలు గా అభివర్ణించారు. ఈ అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి ఉపయోగించుకునేలా సంకల్పం తీసుకోవాలని పేర్కొన్నారు. భారత 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ… అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. మహమ్మారిపై పోరు లో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన పోరాటం అసమానమని అభినందించారు. దేశీయంగా కరోనా టీకా తయారు చేసుకోవడం గర్వకారణమని, స్వయంగా టీకా అభివృద్ధి చేసుకొని ఉండకపోతే.. పోలియో తరహా పరిస్థితి ఏర్పడేదన్నారు.

‘శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలి. 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాలకు మధ్య ఉన్న అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణం కోసం మనం పాటుపడాలి. ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమే. ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలి. సంకల్పం తీసుకుంటే సరిపోదు.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే అది సాకారం అవుతుంది. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌, సబ్ కా విశ్వాస్‌.. ఇవే మన రణ నినాదం కావాలి. సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుంది’ అని మోడీ పిలుపునిచ్చారు.

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లోనే జరగడం గర్వకారణమని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 54 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. టీకాను స్వయంగా అభివృద్ధి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ కింద గత రెండేళ్ల వ్యవధిలో 4.5 కోట్ల ఇళ్లకు నల్లా నీరు అందించినట్లు ప్రధాని తెలిపారు. 2024 నాటికి గ్రామాల్లోని అన్ని గృహాలకు తాగునీరు అందించే లక్ష్యం తో ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ పథకాన్ని 2019 స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. అప్ప‌టి నుంచి క‌రోనా నేప‌థ్యంలో ఈ ప‌థ‌కం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఏతావాతా ఎలా చూసుకున్నా.. మోడీ మ‌రో పాతికేళ్ల‌పాటు.. ప్ర‌ధానిగా ఉండాల‌నే సంక‌ల్పం.. ఈ పంద్రాగ‌స్టు వేడుక ప్ర‌సంగంలో స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.