సల్మాన్ ఖాన్.. 300 కోట్ల సినిమా

సినీ రంగంలో దేన్నయినా టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటే ఏమవుతుందో షారుఖ్ ఖాన్ విషయంలో అందరూ చూశారు. తాను ఏ సినిమా తీసినా బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ వచ్చేస్తున్నాయని.. సినిమాలో తానుంటే చాలని, కథ గురించి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే ఫీలింగ్‌తో కొన్నేళ్ల పాటు వరుసగా సాధారణమైన సినిమాలు చేశాడు షారుఖ్.

ఈ క్రమంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’ లాంటి చెత్త సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఇలా వరుసబెట్టి మామూలు సినిమాలు తీస్తుంటే ఒక దశ దాటాక ప్రేక్షకులకు మొహం మొత్తేస్తుంది. ఆ హీరో మీద నమ్మకం కోల్పోతారు. వరుసగా సినిమాలను తిరస్కరించడం మొదలుపెడతారు. షారుఖ్ విషయంలోనూ అదే జరిగింది.

అంత పెద్ద స్టార్ సినిమాలకు రూ.50 కోట్ల ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి తలెత్తింది. చివరగా షారుఖ్ నుంచి వచ్చిన ‘జీరో’తో అతను దాదాపు జీరో అయిపోయాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండేళ్లకు పైగా విరామం తీసుకుని జాగ్రత్తగా సినిమాలు సెట్ చేసుకుంటున్నాడు.

షారుఖ్ తర్వాత సల్మాన్ సైతం పనికి రాని సినిమాలతో ప్రేక్షకుల తిరస్కారానికి గురవుతున్నాడు. ఈ మధ్యే వచ్చిన అతడి చిత్రం ‘రాధె’ చూసి అభిమానులు కూడా ఛీకొట్టారు. మరీ ఇంత నాసిరకం సినిమాలు తీస్తావా అంటూ సోషల్ మీడియా వేదికగా సల్మాన్‌పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అతను ‘అంతిమ్’, ‘కభీ ఈద్ కభీ దివాలి’ అనే సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత ‘మాస్టర్’ రీమేక్‌లో నటిస్తాడని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు సల్మాన్ ఆలోచన మారినట్లు సమాచారం. వరుసగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు చేస్తే ప్రేక్షకుల్లో పలుచన అయిపోతానని భావించి.. ఇప్పుడో ప్రయోగాత్మక భారీ చిత్రం చేయడానికి అతను రెడీ అయ్యాడట. మ్యాన్ వెర్సస్ నేచర్ కాన్సెప్ట్‌గా పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఒక భారీ సినిమాకు సల్మాన్ సన్నాహాలు చేసుకుంటున్నాడట.

ఈ చిత్ర బడ్జెట్ రూ.300 కోట్లని.. సల్మాన్ కెరీర్లోనే అత్యధిక ఖర్చుతో తెరకెక్కనున్న చిత్రమిదని.. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా చేయడానికి తన టీంతో కలిసి సల్మాన్ పని చేస్తున్నాడని.. త్వరలోనే దీని గురించి అనౌన్స్‌మెంట్ రానుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.