మోడీ తెచ్చిన‌.. ‘స్క్రాప్’ పాల‌సీ.. అభివృద్ధికి ముంద‌డుగట‌!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తుక్కు(స్క్రాప్) ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టారు. ఈ ప‌థ‌కం దేశాన్ని మ‌రింత వేగంగా ముందుకు న‌డిపిస్తుంద‌ని ఆయ‌న ఉద్ఘాటించారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే తెచ్చిన ప‌థ‌కాలు.. దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తున్నాయో.. అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్ర‌క‌టించిన తుక్కు ప‌థ‌కం.. దేశానికి మేలు చేస్తుంద‌ని మోడీ చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లో ఈ పాలసీని ప్రారంభిచారు. దీనితో అభివృద్ధి పరంగా భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుందని పేర్కొన్నారు. కాలుష్య భరిత, కాలం చెల్లిన వాహనాలను తగ్గించుకునేందుకు ఈ పాలసీ ఎంతో కీలకం కానుందని వివరించారు.

వ్య‌ర్థాల నుంచి సంప‌ద‌

వాహనాల తుక్కు కోసం మౌలిక వసతుల ఏర్పాటు విభాగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ కీలక విషయాలను వెల్లడించారు. ఈ పాలసీ భారత్ ఆటోమొబిలిటీ, వాహన రంగానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తుందన్నారు. సుస్థిర, పర్యావరణ హితమైన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని వివరించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు కూడా ఈ పాలసీ ఉపయోగపడనున్నట్లు తెలిపారు. యువత, స్టార్ట‌ప్‌ సంస్థలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని మోడీ పిలుపునిచ్చారు.

కాలుష్యానికి చెక్‌!

దేశంలో ప్రస్తుతం 20 ఏళ్లపైబడిన తేలికపాటి వాహనాలు 51 లక్షలు, 15 ఏళ్లకుమించినవి 34 లక్షలు ఉన్నాయి. ఎలాంటి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేని 15 ఏళ్లకుమించిన భారీ వాణిజ్యవాహనాలు 17 లక్షలు ఉన్నాయి. కొత్తవాహనాలతో పోలిస్తే పాతవాహనాలు 10-12 రెట్లు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించడం.. కొత్త వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడం సహా బహుళ‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పాలసీని తీసుకొచ్చింది.

ఐక్య‌రాజ్య‌స‌మితి వ్యూహం..

ఈ విధానం ద్వారా ప్రత్యక్షంగా పదివేల మందికి, పరోక్షంగా 35వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడంవల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30-40వేల కోట్ల జీఎస్‌టీ ఆదాయం పెరుగుతుందని కూడా భావిస్తోంది. అయితే..వాస్తవానికి.. ఇది ప్ర‌పంచ దేశాల్లో అనుస‌రిస్తున్న విధాన‌మే. 2030 నాటికి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ పాల‌సీలో భాగంగా.. ఐక్య‌రాజ్య‌స‌మితి.. ఈ నిర్ణీత ల‌క్ష్యాల‌ను ఏర్పాటు చేసింది. గ‌త యూపీఏ హ‌యాంలోనే ఈ పాల‌సీకి అంకురార్ప‌ణ జ‌రిగినా.. మోడీ స‌ర్కారు దీనిని ఇంప్లిమెంట్ చేసింది. అయితే.. దీనిని కూడా త‌న ఖాతాలో వేసుకోవ‌డం.. గ‌మ‌నార్హం.