హిందీ డబ్బింగ్.. మెగా హవా


టాలీవుడ్లో మెగా హీరోల హవా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, కలెక్షన్లు, రికార్డులు, సక్సెస్ రేట్ పరంగా మెగా హీరోలదే టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం. కర్ణాటకలో సైతం ఎప్పట్నుంచో మెగా హీరోల జోరు సాగుతోంది. ఐతే ఇప్పుడు ఇతర మార్కెట్లలోనే మెగా హీరోలు దూసుకెళ్తున్నారు.

ముఖ్యంగా ఉత్తరాదిన ప్రభాస్ కాకుండా టాలీవుడ్ నుంచి అంత క్రేజ్ చూపిస్తున్నది మెగా హీరోలే. డబ్బింగ్ సినిమాల ద్వారా వీరికి అక్కడ మంచి మార్కెట్టే ఏర్పడింది. దీంతో తెలుగులో తెరకెక్కే చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేసుకోవడానికి భారీగా ఆఫర్లు ఇస్తున్నారు నార్త్ వాళ్లు. ప్రస్తుతం ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ను పక్కన పెట్టేస్తే తెలుగు నుంచి హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా అత్యధిక ధరలు రాబట్టిన టాప్-3 హీరోలు మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లే కావడం విశేషం.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’ హిందీ డబ్బింగ్ హక్కులకు రెండేళ్ల కిందట రూ.22 కోట్ల రేటు వచ్చింది. అది అప్పటికి రికార్డు. ఈ మధ్యే చరణ్ బాబాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఆయన నటిస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్‌ హిందీ డబ్బింగ్ హక్కులు రూ.23 కోట్లు పలికాయి. ఐతే కొన్ని రోజుల్లోనే ఈ రికార్డు కూడా బద్దలు కావడం, దాన్ని అధిగమించింది మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడం విశేషం. చిరు కొత్త చిత్రం ‘ఆచార్య’ హిందీ డబ్బింగ్ హక్కుల కోసం ఏకంగా రూ.26 కోట్లు ఆఫర్ చేయడం విశేషం.

ఇలా హిందీ డబ్బింగ్ హక్కుల టాప్-3 ప్లేసెస్‌ను చిరు-పవన్-చరణ్ పంచుకోవడం వివేషమే. గత కొన్నేళ్లలో తెలుగు చిత్రాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు హిందీలో అదిరిపోయే స్పందన వస్తోంది. ఇక్కడ డిజాస్టర్లయిన సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే కోట్లల్లో వ్యూస్ వస్తుండటం విశేషం.