పుట్టినరోజున కేసీఆర్ ఎక్కడున్నారు? ఎవరిని మాత్రమే కలిశారు?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 68వ పుట్టినరోజు ధూంధాంగా జరిగింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు తమ సొంత పుట్టినరోజును కూడా జరుపుకోనంత ఘనంగా బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని జలవిహార్ లో మంత్రి తలసాని అధ్వర్యంలో 67కేజీల కేక్ ను కట్ చేశారు.ఈ కార్యక్రమానికి.. దాదాపుగా మంత్రులు.. నగరానికి చెందిన ఎంపీలు.. ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు అంతా హాజరయ్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ ఒక్కరే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో (యూసఫ్ గూడ) శ్రీవారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. టీటీడీ వేదపండితుల్ని ప్రత్యేకతంగా తీసుకొచ్చి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏకంగా 10 వేల మంది హాజరు కావటమే కాదు..వారికి తీర్థప్రసాదాలు మొదలుకొని.. ఒక వివాహ వేడుకను నిర్వహించినంత ఘనంగా వేడుకను జరిపారు.

ఈ రెండు ఉదాహరణలు చాలు.. కేసీఆర్ పుట్టినరోజున టీఆర్ఎస్ నేతలు ఎంత భారీగా వేడుకల్ని నిర్వహించారో అర్థమవుతుంది. వీటితో పాటు.. కేవలం గంట వ్యవధిలో తెలంగాణ వ్యాప్తంగా కోటి మొక్కల్ని నాటిన రికార్డును రాజ్యసభ సభ్యుడు సంతోష్ చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా కేవలం గంట వ్యవధిలోకోటి మొక్కలు నాటేలా ప్లాన్ చేశారు.

మరింత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగే వేళలో.. సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు? ఆయన్ను స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే లక్ ఎంతమందికి దక్కిందన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తాయి. తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ తనకెంతో ఇష్టమైన ఫాంహౌస్ లోనే గడిపారు. ఆయన వద్దకే.. కుటుంబ సభ్యులంతా వెళ్లారు. కొడుకు.. కోడలు.. కూతురు అల్లుడు..మనవళ్లు.. మనమరాళ్లు.. ఇలా అందరూ ఫాంహౌస్ కు వెళ్లి కులాసాగా గడిపినట్లుగా చెబుతున్నారు.

ఫాంహౌస్ లో తన పుట్టిన రోజుసందర్భంగా కేసీఆర్ స్వయంగా ఒక రుద్రాక్ష మొక్కను నాటారు. సో.. సారు పుట్టిన రోజు రాష్ట్రం మొత్తం భారీగా టీఆర్ఎస్ నేతలు జరిపినా.. ఆయన్ను కలిసి విషెస్ చెప్పే లక్ మాత్రం చాలా కొద్దిమందికే లభించిందని చెప్పక తప్పదు.