‘మొబైల్ షీ టాయిలెట్’…వాట్ యాన్ ఐడియా మేడమ్ జీ

బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత పనులు…ఇలా పనేదైనా సరే…ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలంతా ఎదుర్కొనే ప్రధాన సమస్య టాయెలెట్స్. గత కొన్నేళ్లుగా ఈ సమస్యపై పలు స్వచ్ఛంద సంస్థలు పోరాడడంతో ప్రభుత్వాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాయి. ఇవి కొంతవరకు మహిళలు ఎదుర్కొంటోన్న తీవ్రమైన సమస్యను తీరుస్తున్నప్పటికీ…పూర్తి స్థాయిలో ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు చెందిన సుష్మ కల్లెంపూడి అనే మహిళ…తన తోటి మహిళల కోసం వినూత్న ఆవిష్కరణ చేశారు. ఆటోలో ‘మొబైల్ షీ టాయ్ లెట్’కు రూప కల్పన చేసి రికార్డు క్రియేట్ చేశారు. ప్రపంచంలో ఈ విధంగా మహిళల కోసం ఏర్పాటు చేసిన తొలి మొబైల్ టాయిలెట్ ఇదే కావడం నిజంగా భారతీయులతో పాటు తెలుగువారందరికీ గర్వకారణం.

2017లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన సుష్మ….హైదరాబాద్ లో బయటకు వెళ్లే మహిళలు ఎదుర్కొంటోన్న టాయ్ లెట్ సమస్యపై ఫోకస్ పెట్టారు. హైదారాబాద్ వంటి మహానగరంలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫిక్స్ డ్ టాయిలెట్లు ఆ ప్రాంతంలోని వారి అవసరాలకే ఉపయోగపడుతున్నాయని ఆమె గుర్తించారు. అందుకే, ఎక్కడకు కావాలంటే అక్కడకు తరలించేందుకు వీలుగా మొబైల్ టిఫిన్ సెంటర్లు తరహాలో…ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ గా మార్చారు.

తన వినూత్న ఆలోచనతో ఆవిష్కరించిన ఆ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు సుష్మ చూపించారు. టాయిలెట్ లు లేని రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఇ మొబైల్ షీ టాయిలెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సుష్మ వివరించారు. అంతేకాదు, ఈ ఆటోలు పర్యావరణహితంగా పని చేస్తాయని వెల్లడించారు. దీంతో, ఈ ఆటోలను ప్రోత్సహించిన కేసీఆర్ సర్కార్…హైదరాబాద్ లో 25 ఆటోలను ఏర్పాటు చేసింది.

100 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లెష్, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న ఈ ఆటో తయారీకి రూ.4లక్షల ఖర్చవుతుందని సుష్మ తెలిపారు. చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకోవటానికి అనువుగా, మహిళల కోసం ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ ఈ ఆటోలో అందుబాటులో ఉంటాయి. శానిటరీ న్యాప్కిన్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ , జీపీఎస్ కనెక్టెవిటీ ఈ ఆటో ప్రత్యేకత.

పాత ఆటోలను ఈ విధంగా మార్చడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని, ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని ఆటోలను రూపొందిస్తానని చెబుతున్నారు సుష్మ. తెలుగు మహిళ సుష్మ క్రియేటివిటీకి దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రపంచంలోని పలు దేశాలు ఫిదా అయ్యాయి. తాము కూడా ఈ తరహా ఆటోలను రూపొందించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.