చేసిన తప్పే వెంటాడుతోందా ?

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ? పార్టీకి పూర్వవైభవం తేవాలంటే ఏమి చేయాలి ? ఇపుడిదే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహూల్ గాంధీకి అర్ధం కావటంలేదు. 2014లో రాష్ట్ర విభజనకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే కాంగ్రెస్ పార్టీకి ఏపిలో ఘోరీ కట్టేసింది. అప్పట్లో తాము తీసుకుంటున్న నిర్ణయం తప్పని తెలిసినా సరే ఒత్తిడికి తలొగ్గి, ఏదేదో ఊహించుకుని రాష్ట్ర విభజన చేసేసింది యూపీఏ ప్రభుత్వం.

అప్పట్లో చేసిన అడ్డుగోలు విభజనకు పూర్తి బాధ్యత సోనియాగాంధి, రాహూల్ గాంధీదే. దాని పర్యవసానంగానే ఇటు తెలంగాణాలోను అటు ఏపిలో కూడా పార్టీ దెబ్బతినేసింది. తెలంగాణాలో అయినా పార్టీ అంతో ఇంతో మిగిలుంది కానీ ఏపిలో అయితే పదడుగుల లోతు గొయ్యి తవ్వి జనాలు పార్టీని పాతిపెట్టేశారు. అధికారపార్టీగా పచ్చగా కళకళలాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక్కాసరిగా మంటపెట్టిన మునగాకు చెట్టులాగగ మాడిపోయింది. విభజన తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసిన అభ్యర్ధుల్లో ఒక్కరు కూడా గెలవలేదు. అసలు 99 శాతం మంది అభ్యర్ధులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు.

సాధారణ ఎన్నికలే కాదు కనీసం స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఓట్లు వేయటానికి జనాలు ఇష్టపడటంలేదు. ఇదే పరిస్ధితి వచ్చే ఎన్నికల్లో కూడా రిటీటైనా ఆశ్చర్యంలేదు. ఇలాంటి పరిస్ధితుల్లోనే ఢిల్లీలో బుధవారం రాహూల్ ఏపిలోని కీలక నేతలతో భేటీ అవబోతున్నారు. మీటింగులో పాల్గొనేందుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పళ్ళంరాజు, చింతామోహన్, మాజీ ఎంపి కేవీపీ రామచంద్రరావుకు కబురొచ్చింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే మీటింగ్ లో పాల్గొనేందుకు వెళుతున్న వారిలో పళ్ళంరాజు తప్ప మిగిలిన ముగ్గురికి క్షేత్రస్ధాయిలో పట్టేలేదు. కిరణ్, చింతామోహన్ పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే లేదు. ఇక కేవీపీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. కేవీపీ తెరవెనుక మంత్రాంగానికి మాత్రమే పనికొస్తారు. మరి పార్టీలో బలమున్న నేతలను వదిలేసి వీళ్ళతోనే రాహూల్ ఎందుకు సమావేశం అవుతున్నారు ?

ఎందుకంటే క్షేత్రస్ధాయిలో బలమున్న నేతల్లో చాలామంది ఇప్పటికే పార్టీని వదిలేశారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీలోని చాలామంది వైసీపీలో మరికొందరు టీడీపీలో చేరిపోయారు. ఇతర పార్టీల్లో చేరలేని నేతలు, జనాల్లో పెద్దగా పలుకుబడి లేని నేతలు మాత్రమే కాంగ్రెస్ లో కంటిన్యు అవుతున్నారు. అంటే ఉన్నవారిలో పై నలుగురే మహా వృక్షాలన్నమాట. అందుకనే వారితోనే రాహూల్ భేటీ అవుతున్నారు. ఇలాంటి వారితో పార్టీకి పూర్వవైభవం ఎలా సాధ్యమో రాహూల్ కే తెలియాలి. ఏదేమైనా రాష్ట్ర విభజన పై తీసుకున్న తప్పుడు నిర్ణయమే ఇంకా వెంటాడుతోంది.