తెలంగాణ‌ను చూసైనా ఏపీ మార‌దా?

క‌రోనా ధాటికి ఇండియాలో అత్యంత దారుణంగా దెబ్బ తిన్న ఇండ‌స్ట్రీ అంటే థియేట‌ర్ రంగ‌మే. గ‌త ఏడాదిన్న‌రలో అటు ఇటుగా నాలుగైదు నెల‌లు మాత్ర‌మే థియేట‌ర్లు న‌డిచాయి. అది కూడా పూర్తి స్థాయిలో కాదు. ఈ కాలంలో ఆదాయం లేక‌పోగా.. మెయింటైనెన్స్ భారంగా మారింది. ఈ ప‌రిస్థితుల్లో థియేట‌ర్ ఇండ‌స్ట్రీపై ప్ర‌భుత్వాలు కరుణ చూపాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

గ‌త ఏడాది లాక్ డౌన్ కాలంలో ఏపీలోని థియేట‌ర్ల‌కు సంబంధించి నామ‌మాత్రంగా క‌రెంటు బిల్లుల‌ను మాఫీ చేసింది త‌ప్ప‌.. జ‌గ‌న్ స‌ర్కారు ఆ ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తున్న విజ్ఞ‌ప్తుల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

అప్ప‌టికే ఉన్న రేట్ల‌తో టికెట్లు అమ్మినా న‌ష్టాలు పూడ్చుకోవ‌డం క‌ష్టం అంటుంటే.. ద‌శాబ్దం కింద‌టి రేట్లకు సంబంధించిన జీవోల‌ను బ‌య‌టికి తీసి వాటిని అమ‌లు చేయాల‌ని అల్టిమేటం విధించ‌డం ప‌ట్ల ఎగ్జిబిట‌ర్లు ల‌బోదిబోమంటున్నారు. టికెట్ల రేట్లు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ పై ఏపీ ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోవ‌డం, నైట్ షోకు అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏపీలో మెజారిటీ థియేట‌ర్లు తెరుచుకోలేదు. ఉన్న‌వి నామ‌మాత్రంగా న‌డుస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని యాద‌వ్ నేతృత్వంలో సినీ పెద్ద‌ల‌తో మంగ‌ళ‌వారం కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఇందులో అద‌న‌పు షోలకు అనుమ‌తులివ్వ‌డం, విద్యుత్ బిల్లుల మాఫీ లాంటి ప‌రిశ్ర‌మ డిమాండ్ల ప‌ట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. ప్ర‌భుత్వం ఈ ఇండ‌స్ట్రీకి అండ‌గా నిలిచే దిశ‌గా సానుకూలంగా స్పందించిన‌ట్లే తెలుస్తోంది. ఇది తెలంగాణ ఎగ్జిబిట‌ర్ల‌కు ఊర‌టనిస్తోంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ఇలా మ‌ద్ద‌తు ఇస్తుంటే.. ఏపీ స‌ర్కారు మాత్రం టికెట్ల రేట్ల విష‌యంలో ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం.. థియేట‌ర్ ఇండ‌స్ట్రీకి కోలుకునే అవ‌కాశ‌మే ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వ‌తున్నాయి. మ‌రి తెలంగాణ‌లో ప‌రిణామాలు చూశాక అయినా.. రాబోయే రోజుల్లోజ‌గ‌న్ స‌ర్కారు తీరు మారుతుందేమో చూడాలి.