మ‌హేష్‌-త్రివిక్ర‌మ్.. జాన‌ర్ ఏంటంటే?

మ‌హేష్ బాబు-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన అత‌డు సినిమా థియేట‌ర్ల‌లో యావ‌రేజ్‌గా ఆడింది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన రెండో సినిమా ఖ‌లేజా డిజాస్ట‌ర్ అయింది. కానీ ఈ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజే వేరు. అత‌డు థియేట‌ర్ల‌లో ఓ మోస్త‌రుగానే ఆడినా.. టీవీల్లో మాత్రం బ్లాక్‌బ‌స్ట‌రే అయింది. క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. ఇప్ప‌టికీ టీవీలో వ‌స్తుంటే ఈ సినిమాను తెగ చూసేస్తుంటారు.

ఖ‌లేజా కూడా అంతే. మ‌ళ్లీ మ‌ళ్లీ ఎంజాయ్ చేసేలా ఉంటుందీ చిత్రంలో కామెడీ. కానీ సినిమా థియేట‌ర్ల‌లో రిలీజైన‌పుడు మాత్రం ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను అందుకోలేక బోల్తా కొట్టింది. ఖ‌లేజా హిట్ట‌యి ఉంటే త్రివిక్ర‌మ్-మ‌హేష్ త‌ర్వాతి కొన్నేళ్ల‌లోనే మ‌రో సినిమా చేసేవారేమో కానీ.. ఆ సినిమా ఫ‌లితం తేడా రావ‌డంతో వీరి కాంబినేష‌న్ మ‌ళ్లీ కార్య‌రూపం దాల్చ‌డానికి చాలా టైం ప‌ట్టేసింది. ఐతే ఎట్ట‌కేల‌కు ఈ ఏడాదే మ‌ళ్లీ వీళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తున్నారు.

సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చిందే త‌ప్ప‌.. వీళ్లిద్ద‌రూ క‌లిసి ఈసారి ఎలాంటి సినిమా చేస్తున్నార‌న్న‌ది వెల్ల‌డి కాలేదు. ఐతే ఈ చిత్ర స‌హ నిర్మాత అయిన సూర్య దేవ‌ర నాగవంవీ.. మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ క‌లిసి ఏ జాన‌ర్లో సినిమాచేస్తున్నారో ట్విట్ట‌ర్ స్పేస్‌లో వెల్ల‌డించాడు. ఈ సినిమా పూర్తి స్థాయి యాక్ష‌న్ జాన‌ర్లో ఉంటుంద‌ని నాగవంశీ తెలిపాడు. అత‌డు, ఖ‌లేజా కంటే ఈ సినిమా చాలా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని వంశీ ధీమా వ్య‌క్తం చేశాడు. ఈ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టి వచ్చే ఏడాది మ‌హేష్ బాబు పుట్టిన రోజున మ‌ళ్లీ ట్విట్ట‌ర్ స్పేస్‌లోకి వ‌స్తామ‌ని వంశీ చెప్ప‌డం మ‌హేష్ అభిమానుల‌కు ఎంతో ఉత్సాహాన్నిచ్చే విష‌య‌మే.

త్రివిక్ర‌మ్ సినిమాల్లో యాక్ష‌న్ ఉంటుంది కానీ.. వినోద‌మే ప్ర‌ధానం. పూర్తిగా యాక్ష‌న్ జాన‌ర్లో సినిమా చేయ‌బోతున్నాడంటే ఇదేదో స్పెష‌ల్ అనే చెప్పాలి. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్లో తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.