కేసీయార్ పైకి మరో ప్రత్యర్ధి ?

తెలంగాణాలో ఉన్న వాళ్ళు సరిపోనట్లుగా కేసీయార్ కు మరో ప్రత్యర్ధి తయారయ్యారు. ఈమధ్యనే ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీయార్ ను సవాలు చేస్తున్నారు. తొందరలోనే జనాలు ఏనుగుపైకి ఊరేగుతు ప్రగతిభవన్లోకి ప్రవేశిస్తారంటూ ప్రకటించారు. ఏనుగుపై ఎక్కటమంటే అధికారంలోకి రావటమని ప్రవీణ్ చెప్పకనే చెప్పారు. బీఎస్పీ పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రగతిభవన్ అంటే ముఖ్యమంత్రి అధికారిక నివాసం. ఏనుగును ఎక్కి ప్రగతిభవన్లోకి వెళతామంటే అధికారంలోకి వస్తామని చెప్పటమే.

ఇప్పటికే ఒకవైపు రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ మరోవైపు బండి నేతృత్వంలోని బీజేపీ కేసీయార్ ను గట్టిగా తగులుకుంటున్నాయి. ఇటు రేవంత్ అటు బండి ఇద్దరు కేసీయార్ తో పాటు కేటీయార్ లాంటి టీఆర్ఎస్ ప్రముఖులను గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఒకపుడు కేసీయార్ ధాటికి తెలంగాణాలో సరైన సమాధానం చెప్పేవారే లేరన్నట్లుగా సాగింది రాజకీయాలు. కానీ ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుడిగా బండి నియమితులైన దగ్గరనుండి రాజకీయం మారుతోంది.

ఇదే సమయంలో రేవంత్ కూడా యాక్టివ్ అయ్యారు. దాంతో కేసీయార్ ను ఒకవైపు బండి మరోవైపు రేవంత్ గట్టిగా తగులుకుంటున్నారు. దాంతో అధికారపార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. తాజాగా రేవంత్ కే కాంగ్రెస్ పగ్గాలు దక్కటంతో ఒక్కసారిగా స్పీడుపెంచారు. వీళ్ళద్దరు కాకుండా కోదండ్ రామ్ లాంటి వ్యక్తులు కూడా కేసీయార్ టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఇంతమంది సరిపోరన్నట్లుగా కొత్తగా ఇపుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తయారయ్యారు.

బీఎస్పీ సమన్వయకర్తగా నియమితులైన ప్రవీణ్ అధ్యక్షతన నల్గొండలో భారీ బహిరంగసభ నిర్వహించారు. మొదటి బహిరంగసభలోనే కేసీయార్ పై ప్రవీణ్ ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణాలోని బహుజనులందరినీ ఏకం చేసి టీఆర్ఎస్ ను ఓడించటమే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు ప్రవీణ్ ప్రకటించారు. బహుజనలంటే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలతో పాటు అణగారిని వర్గాలన్నీ వస్తాయి.

ప్రవీణ్ ఊపు చూస్తుంటే రేపటి హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీఎస్పీ తరపున అభ్యర్ధిని దించేట్లే ఉన్నారు. అదేగనుక జరిగితే ఏ పార్టీకి నష్టం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే బీసీలు, ఎస్సీల ఓట్లను టార్గెట్ చేసుకునే కేసీయార్ దళితబంధని ఇంకోటని ప్రకటిస్తున్నారు. ఇపుడు బీఎస్పీ కూడా ఉపఎన్నికలో యాక్టివ్ అయితే పథకాలు తీసుకునే వాళ్ళలో కొందరు ఏనుగును సమర్ధించినా కేసీయార్ కు నష్టమనే చెప్పాలి. తెలంగాణా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సిందే.