నల్గొండ సభలో అల్లు.. నాగార్జున.. మహేశ్ ప్రస్తావన ఎందుకొచ్చింది?


మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. బీఎస్పీ (బహుజన్ సమాజ్ వాదీ పార్టీ)లో చేరటం తెలిసిందే. నల్గొండలో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ను నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజానీకం హాజరైంది. ఈ సభకు వేలాది మంది పోటెత్తారు. అంచనాలకు మించిన ఉత్సాహంగా వచ్చిన కార్యకర్తలతో బహిరంగ సభ ప్రాంగణం పులకించింది. నల్గొండ పట్టణం నీలి మేఘం కమ్ముకన్నటైంది.

ఈ భారీ బహిరంగ సభలో ప్రధానాకర్షణగా మారారు ప్రవీణ్ కుమార్. ఘాటైన పదజాలంతో ఆవేశంగా ఆయన మాట్లాడిన మాటలకు సభికుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్.. తన ప్రసంగంలోకి అనూహ్యంగా అల్లు అరవింద్.. అల్లు అర్జున్.. నాగార్జున.. మహేశ్ బాబు ప్రస్తావనను తీసుకొచ్చారు. రాజకీయ ప్రసంగంలోకి వీరి పేర్లు రావటం ఏమిటన్న ఆశ్చర్యానికి గురవుతున్నారా? ప్రవీణ్ మాటల్ని వింటే ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.

తాము స్థాపించాలని భావిస్తున్న బహుజన రాజ్యం ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశారు ప్రవీణ్ కుమార్. అణగారిన వర్గాల తరఫున పోరాడే తాను.. అధికారంలోకి వస్తే ఆయా వర్గాల వారికి కొత్త తరహా జీవితాన్ని పరిచయం చేస్తానన్న మాటను చెప్పుకొచ్చారు. బహుజన రాజ్యంలో అన్ని కులాలకు సమానమైన వాటా లభిస్తుందని.. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తుందన్నారు.

చైనాతో క్రీడల్లో పతకాల కోసం పోటీ పడే రోజులు వస్తాయని.. మైనార్టీల బిడ్డలు మిలియనీర్లు అవుతారని.. దళితులు డాలర్లు సంపాదిస్తారన్నారు. బంజారా బిడ్డలు బంగ్లాల్లో ఉంటారన్న ఆయన.. వడ్డెరన్న బిడ్డలు రాకెట్లు ప్రయోగిస్తారన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బలమైన కథానాయకులుగా ఉన్న పలువురు పేర్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

‘‘అల్లు అరవింద్.. అల్లు అర్జున్.. నాగార్జున.. మహేశ్ బాబులే కాదు. మా బిడ్డలు కూడా ఆ రంగంలోకి వెల్లేదాకా నిద్రపోరు. మన బిడ్డలు వాళ్లంతట వాళ్లే కంపెనీలు పెట్టి సంపద సృష్టించి ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు.