వాళ్లు మెడల్స్ గెలిస్తే.. బాలీవుడ్‌పై కౌంటర్లు

మధ్యలో నిరాశకు గురి చేసినా.. చివరికొచ్చేసరికి టోక్యో ఒలింపిక్స్‌ను భారత బృందం సంతృప్తిగానే ముగిస్తోంది. ఇప్పటిదాకా భారత ఒలింపిక్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా టోక్యోలో ఏడు పతకాలు దక్కాయి దేశానికి. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన ఆరు పతకాలదే ఇప్పటిదాకా రికార్డు. గత పర్యాయం ఆ సంఖ్యను మించేస్తామని ఆశిస్తే కేవలం రెండు పతకాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి పతక పోటీల తొలి రోజే మీరాబాయి చాను రజతం గెలవడంతో మన బృందంపై అంచనాలు పెరిగిపోయాయి.

కానీ భారీ అంచనాలు పెట్టుకున్న షూటర్లు సహా తర్వాత ఐదారు రోజుల్లో భారత క్రీడాకారులు తీవ్రంగా నిరాశ పరిచారు. ఐతే తర్వాతి వారం రోజుల్లో ప్రదర్శన మెరుగైంది. అరడజను పతకాలు వచ్చాయి. చివరి రోజు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడంతో టోక్యోలో భారత్‌ ప్రయాణానికి అద్భుతమైన ముగింపు లభించింది.

ఐతే భారత క్రీడాకారులు అక్కడలా పతకాలు గెలుస్తుంటే.. సోషల్ మీడయిాలో బాలీవుడ్ వాళ్లపై కౌంటర్ల మీద కౌంటర్లు పడుతున్నాయి. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే ఏ ఒక్కరినీ వీళ్లు విడిచిపెట్టరని.. వెంటనే వారి బయోపిక్స్ కోసం సన్నాహాలు మొదలుపెట్టేసి ఉంటారని.. ఉన్నవీ లేనివీ కల్పించి సినిమాలు తీసి ఆయా క్రీడాకారులపై ఉన్న ఇంప్రెషన్ కూడా పోగొట్టేస్తారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

మిల్కాసింగ్, ధోని లాంటి వాళ్ల బయోపిక్స్ బాగా ఆడాయి కానీ.. మిగతా స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అప్పట్లో ‘మేరీకోమ్’ సినిమాకు ఆదరణే దక్కలేదు. ఈ మధ్య సైనా మీద సినిమా వస్తే అదీ తుస్సుమంది. ఇంకా సింధు, సానియా, గోపీచంద్ లాంటి వాళ్ల బయోపిక్స్ లైన్లో ఉన్నాయి. అవి ఎంతకూ తెగట్లేదు. ఇప్పుడేమో బాలీవుడ్ వాళ్లు ఒలింపిక్స్ మెడలిస్టులపై పడతారని.. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా లాంటి వాళ్లను వదిలే ప్రసక్తే ఉండదని.. ముఖ్యంగా కొన్ని రోజుల్లోనే నీరజ్ చోప్రా బయోపిక్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాగా నీరజ్ బయోపిక్ గురించి ఇంతకుముందే అతణ్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తన పాత్రలో రణదీప్ హుడా లేదా అక్షయ్ కుమార్ నటిస్తే బాగుంటుందని పేర్కొనడం విశేషం.