జ‌గ‌న్ వైఖ‌రితో త‌ల ప‌ట్టుకున్న బ్యాంక‌ర్లు..!

ఏపీ పొలిటిక‌ల్ , మీడియా స‌ర్కిల్స్‌లో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పుల‌తో ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకు దిన‌దిన‌గండంగా మారిపోతోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల మేర‌కు భారీ స్థాయిలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌భుత్వానికి వ‌చ్చిన, వ‌స్తున్న ఆదాయం.. వ‌చ్చిన‌ట్టే.. ల‌బ్ధిదారుల ఖాతాల‌కు మ‌ళ్లుతున్నాయి. దీంతో ఒక‌వైపు క‌రోనా నేప‌థ్యంలో ఆదాయం త‌గ్గిపోయి.. మ‌రోవైపు సంక్షేమం పేరిట‌.. నిధులు ఖ‌ర్చ‌యిపోతుంటే.. అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అయితే.. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే క్రెడిట్ లిమిట్‌ను ఏపీ స‌ర్కారు దాటేసింది. అదే స‌మ‌యంలో బాండ్ల అమ్మ‌కం కూడా అయిపోయింది. ఆర్బీఐ వ‌ద్ద‌.. అధిక వ‌డ్డీల‌కు అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. దీంతో ఇక ఎటూ అప్పులు పుట్ట‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం వినూత్న ఐడియాకు తెర‌దీసింది. కొన్ని కార్పొరేష‌న్ల‌ను తెర‌మీదికి తెచ్చి.. వాటి ద్వారా రుణాలు స్వీక‌రించే కార్య‌క్ర‌మాల‌కు తెర‌దీశారు. ఈ క్ర‌మంలోనే ఏపీ స్టేట్ డెలవప్‌మెంట్ కార్పొరేషన్‌(ఏపీఎస్‌డిసీ)ని ఏర్పాటు చేశారు.

ఈ కార్పొరేష‌న్‌కు లిక్క‌ర్‌పై స‌ర్కారుకు వ‌స్తున్న ప‌న్నుల‌ను బ‌ద‌లాయించి.. స‌ర్కారు ఆదాయంగా చూపించి.. బ్యాంకర్ల వద్ద అప్పు తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎస్‌బీఐ క్యాప్ అనే సంస్థ మ‌ధ్య వ‌ర్తిగా ఉండి.. వ్య‌వ‌హారం చక్క‌బెట్టి కమీషన్ తీసుకుంది. రుణాలు ఇప్పించడానికి ఎస్‌బీఐ క్యాప్‌ ను ప్రభుత్వం నియమించుకుంది. అయితే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసే స‌మ‌యంలో స‌ర్కారు చూపెడుతున్న హామీలు రాజ్యాంగబద్దమేనా…అనే ప‌రిశీల‌న చేసుకోవాల్సిన‌ విష‌యంలో చేసిన నిర్ల‌క్ష్యం ఇప్పుడు..బ్యాంక‌ర్ల‌కు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే.. ఏపీఎస్‌డీసీ సంస్థ రాజ్యాంగ బ‌ద్ధం ఎలా అవుతుంద‌నే విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం ఆరా తీసింది.

ఈ విష‌యంలో ఏపీకి తాఖీదు కూడా పంపింది. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం వివ‌ర‌ణ చూశాక‌.. కేంద్రం నిర్ణ‌యం తీసుకోనుంది. ఒక‌వేళ వ్య‌తిరేకంగా నిర్ణ‌యం వ‌స్తే.. సంస్థ‌ను మూసివేయాల్సి ఉంటుంది. ఇదే జ‌రిగితే.. దీనిని హామీగా పెట్టుకుని.. రుణాలు ఇచ్చిన బ్యాంక‌ర్లు.. తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం… చెల్లించ‌లేని ప‌రిస్థితే ఎదురైతే… కోర్టులకూ వెళ్లలేని పరిస్థితి. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఎలా ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నిస్తే.. బ్యంకులకు ఇబ్బందే. దీంతో ఇప్పుడు బ్యాంక‌ర్లు త‌ల ప‌ట్టుకున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.