థియేటర్ల కష్టాలపై జగన్ మామ మాట్లాడలేడా?

కరోనా-లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్ల వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది. మొత్తం ఇండియాలో కనీసం పది శాతం థియేటర్లు అయినా మూతపడి ఉంటాయనడంలో సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే మూతపడ్డాయి. మల్టీప్లెక్సుల వెనుక పెద్ద సంస్థలు ఉండటం వల్ల అవి ఎలాగో మనుగడ సాగిస్తున్నాయి.
థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఉన్న కరోనా ఇబ్బందులు చాలవన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్యంగా టికెట్ల ధరల మీద నియంత్రణ తీసుకురావడం.. దశాబ్దం కిందటి రేట్లు అమలు చేయాలంటూ ఆదేశాలు రావడంతో కష్టాలు రెట్టింపయ్యాయి.

పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను దెబ్బ కొట్టేందుకు తెచ్చిన జీవో మొత్తం తెలుగు సినీ పరిశ్రమ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు అందరు నిర్మాతలూ ఇబ్బంది పడుతున్నారు. ఎంత చిన్న సెంటర్ అయినా సరే.. 20-30-40 రూపాయల రేట్లకు టికెట్లు అమ్మి మనుగడ సాగించడం అసాధ్యం అనడంలో సందేహం లేదు. గత పదేళ్లలో అన్ని ధరలూ కొన్ని రెట్లు పెరిగాయి.

సినిమా టికెట్లను దశాబ్దం కిందటి రేట్లతో అమ్మాలనడమే విడ్డూరం. ప్రేక్షకులకు కూడా ఇది సహేతుకంగా అనిపించడం లేదు. కానీ జగన్ సర్కారు తర్కంతో ఆలోచించకుండా మొండి పట్టుదలను కొనసాగిస్తోంది. పవన్ సినిమాను ఇబ్బంది పెట్టి వెంటనే జీవోను మార్చేస్తే విమర్శలు వస్తాయనో ఏమో.. ఆ విధానాన్నే కొనసాగిస్తున్నారు. ఐతే ఎగ్జిబిటర్ల బాధ మాత్రం మామూలుగా లేదు. ఇటీవల థియేటర్లు పున:ప్రారంభం అయినా వారిలో సంతోషం లేదు.

గత వారం రిలీజైన చిత్రాలకు మామూలుగానే ఓపెనింగ్స్ తక్కువ అంటే.. టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల ఏపీలో షేర్ మరీ తక్కువ వచ్చింది. ఈ రేట్లతో థియేటర్లను నడపడం అసాధ్యం అనే అంటున్నారు. ఐతే ఎగ్జిబిటర్ల కష్టాలేంటో జగన్ కుటుంబంలోనే ఒకరికి బాగా తెలుసు. ఆయనే జగన్ మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి. కడప టౌన్లో దాదాపు సగం థియేటర్లు ఆయనవే.

విజయవాడలో సైతం జగన్ బంధువులకు కొన్ని థియేటర్లున్నాయి. ఏపీలో ఇంకా చాలా చోట్ల వైకాపా నాయకులకు, మద్దతుదారులకు థియేటర్లున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్ల మనుగడ కష్టమని వాళ్లందరికీ తెలియంది కాదు. మరి కనీసం రవీంద్రనాథరెడ్డి అయినా సీఎంతో ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నట్లు..? ఆయన మనసెందుకు మార్చలేకపోతున్నట్లు..?