తూర్పు లో జ‌న‌సేన‌కు గ్రాఫ్ అంత పెరిగిందా ?

ఏపీలో రాజకీయంగా మార్పు రావాలి అంటే అంతా తూర్పు గోదావరి జిల్లానే చూస్తారు. ఈ సెంటిమెంట్ ఉమ్మడి ఏపీ నుంచి కూడా ఉంది. నాడు తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ కదలికలు మొదలైతే చాలు మొత్తం ప్రభుత్వం మారినట్లే అనేవారు. నాడు వైఎస్సార్ కానీ, అంతకు ముందు ఎన్టీఆర్ కానీ, ఇక విభజన తరువాత చంద్రబాబు, జగన్ లు కానీ తూర్పులో భారీ మార్పు వల్లనే ముఖ్యమంత్రులు కాగలిగారు. 2014లో టీడీపీని ఆశీర్వదించిన తూర్పు 2019 నాటికి ఫేస్ చేంజి చేసుకుని జగన్ కి పట్టం కట్టింది. ఇక తూర్పులో అనేక సామాజిక వర్గాలు ఉన్నా కూడా ఎక్కువగా కాపులు రాజకీయాలు శాసిస్తూంటారు. వీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే వారిదే రాజ్యాధికారం అన్న మాట ఉంది.

ఇక 2019 నాటికి కాపులు టీడీపీని ధిక్కరించారు. జనసేన కూడా దూరం అయింది. దాంతో వైసీపీ సులువుగా విజయం సాధించింది. ఇపుడు తూర్పులో రాజకీయంగా సత్తా చాటడానికి జనసేన చూస్తోంది. ఇందులో భాగంగా జిల్లా మీద ఆ పార్టీ హై కమాండ్ దృష్టి పెట్టింది. తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గా కందుల దుర్గేష్ ని ఇటీవ‌లే పవన్ కళ్యాణ్ నియమించారు. దుర్గేష్ కి రాజకీయ అనుభవం ఉంది. ఆయన కాంగ్రెస్ టైమ్ లోనే ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక జనసేన జిల్లాలో బలపడాలని గట్టిగా కాంక్షించే ఆయన పార్టీ కోసం పనిచేసేలా క్యాడర్ ని ముందుడి ప్రోత్సహిస్తారు. ఆయన సేవలకు గుర్తింపుగా జిల్లా ప్రెసిడెంట్ గా చేయడం ద్వారా పవన్ సముచిత నిర్ణయం తీసుకున్నారనే అంటున్నారు.

దుర్గేష్ 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేశారు. ఓటమి వరించినా జగన్ వేవ్ లో కూడా 42 వేలకు పైగా ఓట్లను సాధించి గట్టి పట్టుని ఆయన నిరూపించుకున్నారు. ప్రజారాజ్యం టైం నుంచి కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టుని సాధించారు. ఆ క్యాడర్ ఇపుడు జనసేనకు షిఫ్ట్ అయ్యారు.

నిజం చెప్పాలంటే ఇక్కడ టీడీపీ గట్టిగా ఉంది. 2009లో ఇక్కడ అసెంబ్లీ సీటు ఏర్పడిన నాటి నుంచి కూడా టీడీపీయే గెలుస్తూ వస్తోంది. చందన రమేష్ 2009లో గెలిస్తే 2014 నుంచి రెండు పర్యాయాలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుస్తున్నారు. ఆయన వయోభారం కారణనా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు అని టాక్. తన వారసుడికి టికెట్ కోసం ఆయన చంద్రబాబు వద్ద రాయబారం నడుపుతున్నారు.

కానీ జనసేంతో పొత్తు కుదిరిగే ఈ సీటు కచ్చితంగా ఆ పార్టీకే దక్కుతుంది. జిల్లా ప్రెసిడెంట్ కూడా కాబట్టి 2024లో ఇక్కడ నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయడం ఖాయం. మరో వైపు చూస్తే వైసీపీ ఇక్కడ వీక్ గా ఉంది. ఆకుల వీర్రాజు రెండు సార్లుగాపోటీ చేస్తూ వస్తున్నారు. కానీ వరస ఓటమి తో పాటు ఓట్లు కూడా తగ్గుతున్నాయి. ఇటీవ‌ల కొత్త కో ఆర్డినేట‌ర్‌గా చంద‌న ర‌మేష్ వ‌చ్చినా వైసీపీకి పెద్ద యూజ్ లేదు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలిచిన ఏకైక సీటు ఈ జిల్లాలోని రాజోలు. ఇటీవ‌ల స్థానిక ఎన్నిక‌ల్లో తూర్పులోనే జ‌న‌సేన ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. ఈ సారి టీడీపీతో పొత్తు ఉంటే క‌నుక కందుల దుర్గేష్ ఆధ్వ‌ర్యంలో తూర్పు గోదావ‌రిలో జ‌న‌సేన కొన్ని సంచ‌ల‌న ఫ‌లితాలు న‌మోదు చేసే ఛాన్సులే ఉన్నాయ‌ని ఆ పార్టీ అధిష్టానం న‌మ్ముతోంది.