జ‌గ‌న్‌ను ఆర్థిక దిగ్బంధ‌నం చేస్తున్నారా ?


ఏపీ అప్పులలో ఉంది. గట్టిగా చెప్పాలంటే అష్ట దిగ్బంధనంలో ఏపీ ఉంది. కొత్త పైసా పుట్టదు. అలాగే కొత్త అప్పు కూడా పుట్టదు. మరో వైపు ప్రతీ నెలా తొలి వారంలోనే 13 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చులు ఉంటాయి. దాంతో జగన్ సర్కార్ కి ఏ నెలకు ఆ నెల ఇబ్బందులే ఎదురవుతున్నాయి. సంక్షేమ పధకాలకు ఎక్కడ లేని డబ్బూ చాలడంలేదు. జగన్ క్యాలండర్ ని కూడా ప్రకటించి మరీ డేట్స్ వారీగా పంచుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక ఉద్యోగుల జీతాలు కూడా స‌రైన టైంకు ఇవ్వ‌డం లేదు. మ‌రోవైపు త‌మ‌కు చెప్ప‌కుండా కొత్త‌గా అప్పులు చేయ‌డానికి వీళ్లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం కొర్రీలు వేస్తోంది. ఇక రోజావారి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హ‌ణ‌కు, ఉద్యోగుల జీతాల‌కూ మిగిలిన శాఖల నుంచి కూడా నిధులు లాగేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బీసీ కార్పోరెషన్ నుంచి నిధులు మళ్ళించి జగన్ పధకాలకు వాడుతున్నారని అంటున్నారు. దీని మీద టీడీపీ గట్టిగానే విమర్శలు చేస్తోంది. బీసీల మీద వైసీపీ పెద్దలకు ఉన్న ప్రేమ ఇంతేనా అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్ కి నేరుగా లేఖ రాశారు. బీసీలకు ఈ సర్కార్ ఏమీ చేయకపోగా వారి నిధులకు కూడా ఎసరు పెడుతోందని ఆయన అంటున్నారు. విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా గతంలో తమ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు చేసిందని, జగన్ పథ‌కాల మాటున దారుణంగా నష్టపరుస్తున్నారు అని కూడా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం ఒక వైపు ఆర్ధిక నిబంధలను పెట్టింది. తమ పధ‌కాలను వేరేగా ఇతర కార్యక్రమలకు మళ్ళించరాదని కూడా ఖండితంగా చెబుతోంది. అదే విధంగా కేంద్రం కొత్త అప్పులు పుట్టకుండా గట్టిగానే బిగించేసింది. వీటి ఫలితాలు కొద్ది రోజుల్లో వస్తాయని అంటున్నారు. జగన్ కి ఏ విధంగా అయినా ఆర్ధిక ఇబ్బందులు క్రియేట్ చేయాలని అటు బీజేపీ ఇటు టీడీపీ కూడా చూస్తున్నాయి. దీంతో జగన్ ఏదో ఒకనాడు తన పధకాలను అమలు చేయలేక చేతులు ఎత్తేస్తాడు అని టీడీపీ గట్టిగా విశ్వసిస్తోంది. అదే కనుక జరిగితే మాత్రం జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది, దాంతో తాము రాజకీయంగా ముందుకు దూసుకుపోవచ్చు అని కూడా భావిస్తోంది.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇదే స్టైల్లో ఇబ్బందులు పెట్టి బాబు ప్ర‌భుత్వంపై వ‌త్యిరేక‌త వ‌చ్చేలా ప్లాన్ చేసింది. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం విష‌యంలోనూ కేంద్రం అదే చేస్తోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.