విజయేంద్ర ప్రసాద్.. ఒక వెరైటీ బయోపిక్


ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్, అత్యంత డిమాండ్ ఉన్న రైటర్లలో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. పాన్ ఇండియా సినిమాలు పెద్ద ఎత్తున తెరకెక్కుతున్న ప్రస్తుత తరుణంలో వివిధ భాషల్లో పని చేస్తూ ‘పాన్ ఇండియా రైటర్’ అనిపించుకుంటున్నారాయన. ‘బాహుబలి’ తర్వాత ఆయన డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో చిత్రాలకు ఆయన పని చేశారు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో మూణ్నాలుగు భారీ చిత్రాలున్నాయి.

రామాయణంలో సీత పాత్రను తీసుకుని కొత్త ఇతివృత్తంతో ఓ స్క్రిప్టును ఆయన సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ధ్రువీకరించారు. అలాగే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాకు కూడా కథ వండే ప్రయత్నంలో ఉన్నారు విజయేంద్ర. ఐతే ఈ సినిమా కథ విషయంలో ఇంకా కాంక్రీట్‌గా ఏమీ లేదని అంటున్నారాయన. ఇవి కాక విజయేంద్ర ప్రసాద్ ఒక వెరైటీ బయోపిక్‌కు రెడీ అవుతున్నారు. అది మహారాష్ట్రకు చెందిన రంజిత్ సింగ్ దిశాలే అని ఉపాధ్యాయుడికి సంబంధించిన సినిమా కావడం విశేషం.

తాను పని చేసే పాఠశాలలో విద్యా బోధనకు సంబంధించి వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో పేదరికం వల్ల బడికి దూరమవుతున్న అనేకమంది పిల్లల్ని మళ్లీ చదువు వైపు మళ్లించిన టీచర్ రంజిత్ సింగ్. ఒక షెడ్డులో కొనసాగుతున్న పాఠశాలకు భవనం నిర్మించేలా చేయడంతో పాటు స్థానిక భాషల్లో పుస్తకాలు ముద్రించి పిల్లలు సులువుగా పాఠాలు నేర్చుకునేలా కూడా చేశారు. ఈ క్రమంలో గత ఏడాది 124 దేశాల ఉపాధ్యాయులు పోటీ పడ్డ గ్లోబల్ టీచర్ అవార్డుకు రంజిత్ సింగ్ ఎంపికయ్యారు.

మొత్తం 12 వేల మంది పోటీ పడితే.. 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి, చివరికి రంజిత్‌కు ఈ అవార్డు కట్టబెట్టారు. ఈ అవార్డుతో పాటు మిలియన్ డాలర్ల (దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు) ప్రైజ్ మనీ దక్కగా.. తనతో పాటు ఫైనల్‌కు చేరిన మిగతా తొమ్మిది మంది కూడా ఈ అవార్డుకు అర్హులే అంటూ అందులో సగం ప్రైజ్ మనీని వారికి పంచేశారు రంజిత్. ఈ విశేషాలన్నీ వెల్లడిస్తూ తాను ఆ టీచర్ బయోపిక్ రాస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. పాన్ ఇండియా లెవెల్లోనే ఈ సినిమా తెరకెక్కే అవకాశముంది. ఈ చిత్రానికి కథానాయకుడెవరు.. దర్శక నిర్మాతలెవరు అన్నది విజయేంద్ర ఇంకా చెప్పలేదు.