శిల్పా శెట్టి ఏం చెప్పింది.. ఏమీ చెప్పలేదు


బాలీవుడ్ భామ శిల్పా శెట్టి ఇప్పుడు తన జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. శిల్పా ఏరి కోరి పెళ్లి చేసుకున్న రాజ్ కుంద్రా.. ఇప్పుడు తన కుటుంబ పరువును బజారున పెట్టేశాడని ఆమె ఆవేదనకు గురవుతోంది. వేరే ఏ కేసైనా సరే కానీ.. పోర్న్ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ వాటిని మొబైల్ యాప్స్ ద్వారా రిలీజ్ చేసి కోట్లు గడిస్తున్నాడని.. చాలామంది అమ్మాయిలను ఇందుకోసం వేధింపులకు గురి చేశాడని ఆరోపణలు రావడంతో శిల్పాకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ఈ కేసు ఎక్కడిదాకా వెళ్తుందో ఏమో కానీ.. దాని ప్రభావాన్ని మాత్రం శిల్పా ఇప్పటికే చూస్తోంది. ఆమెను ఒక డ్యాన్స్ షో నుంచి తప్పించారు. అలాగే కొన్ని బ్రాండ్స్ కూడా ఆమెకు దూరం అయ్యాయి. మున్ముందు మరింతగా ఆమె నష్టాల పాలవుతుందని అంచనా వేస్తున్నారు. ఐతే ఇప్పటిదాకా రాజ్ కుంద్రా అరెస్టు గురించి స్పందించని శిల్పా తొలిసారి.. దీనిపై నోరు విప్పింది. ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.

ఐతే ఈ స్టేట్మెంట్లో శిల్పా సూటిగా ఏమీ మాట్లాడలేదు. తన భర్తపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించలేదు. పోలీసుల విచారణ జరుగుతోంది కాబట్టి అందరూ సైలెంటుగా ఉండాలని.. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. ఈ వ్యవహారంపై ఏమీ మాట్లాడదలుచుకోలేదని రొటీన్ వ్యాఖ్యలే చేసింది శిల్పా. ఈ కేసుకు సంబంధించి మీడియా మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న శిల్పా.. వివిధ సంస్థలపై పరువు నష్టం దావా వేయడం.. దాన్ని కోర్టు విచారణకు స్వీకరించకపోవడం తెలిసిందే.

తాజా స్టేట్మెంట్లో శిల్పా మీడియా పట్ల మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టింది. విషయం పూర్తిగా తెలుసుకోకుండా వార్తలు పుట్టించొద్దని.. తాను న్యాయ పరమైన విచారణ కోసం చూస్తున్నానని.. మీడియా ట్రయల్ వద్దని ఆమె వ్యాఖ్యానించింది. మీడియాతోపాటు అయినవాళ్లు కూడా తనను, తన కుటుంబాన్ని నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారని.. కేసు విచారణ దశలో ఉన్నందున తాను ఇప్పుడు ఈ విషయంపై స్పందించదలుచుకోలేదని శిల్పా స్పష్టం చేసింది. ఒక తల్లిగా తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నానని.. అధికారికంగా పూర్తి సమాచారం లేకుండా కామెంట్లు చేయకండని శిల్పా విన్నవించిందవి.