కేంద్రం దూకుడుతో జ‌గ‌న్‌కు మ‌ళ్లీ కొత్త చిక్కే ?

కేంద్రం దూకుడు ఏపీ సీఎం జ‌గ‌న్ కొంప ముంచుతోంది. అవ‌స‌ర‌మైన విష‌యాల్లో.. ముఖ్యంగా జ‌గ‌న‌కు అంతో ఇంతో మైలేజీ ఇచ్చే విష‌యాల్లో కేంద్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ.. ఇరుకున పెడుతుండ‌గా.. శాస‌న మండ‌లి విష‌యంలోమాత్రం.. జ‌గ‌న్ స‌ర్కారు చేసిన తీర్మానాన్ని ఆమోదించే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు ఇస్తుండ‌డం ఇప్పుడు వైసీపీ వ‌ర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. దీంతో ఇప్పుడు చేయాలి ? అనే విష‌యం అధికార పార్టీలో అంత‌ర్మ‌థ‌నానికి దారితీస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఏడాదిన్న‌ర కింద‌ట‌.. రాష్ట్ర శాస‌న మండ‌లిలో వైసీపీ బ‌లం చాలాత‌క్కువ‌. టీడీపీ అత్యంత బ‌లంగా ఉండేది. అయితే.. అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు, ఏపీ సీఆర్‌డీఏ ర‌ద్దు బిల్లుల‌ను టీడీపీ మండ‌లిలో వ్య‌తిరేకించింది.

దీంతో జ‌గ‌న్ స‌ర్కారు రాత్రికి రాత్రి మండ‌లి ర‌ద్దు ప్ర‌తిపాదించారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. మండ‌లి వ‌ల్ల ఖ‌ర్చు త‌ప్ప ప్ర‌యోజ‌నం లేద‌ని.. అందుకే ర‌ద్దు చేస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన రాష్ట్రానికి ప్ర‌యోజ‌నక‌ర‌మైన నిర్ణ‌యాల‌ను కూడా టీడీపీ అడ్డుకుంటోంద‌ని.. అందుకే మండ‌లి ర‌ద్దుకు ప్ర‌తిపాదిస్తున్నామ‌ని.. నాడు స‌భ‌లో ప్ర‌క‌టించి..ఆవెంట‌నే ర‌ద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపారు. అయితే.. ఏడాదిన్న‌ర కాల‌మైన నేప‌థ్యంలో కేంద్ర య‌థావిధిగా ఇత‌ర అంశాల మాదిరిగానే దీనిని కూడా చాప‌చ‌ట్టేసిన‌ట్టేన‌న‌ని అంద‌రూ అనుకున్నారు. ఈలోగా.. మండ‌లిలో ప‌ద‌వులు ఖాళీ అవుతుండ‌డంతో వైసీపీలో రాజ‌కీయంగా ప‌ద‌వుల‌కు దూరంగా వారిని.. కొత్త‌గా పార్టీలో చేరిన వారిని జ‌గ‌న్ వ‌రుస పెట్టి.. మండ‌లికి పంపిస్తున్నారు.

దీంతో ఇప్పుడు మండ‌లిలో వైసీపీ ఆధిప‌త్యం పెరుగుతూ వ‌స్తోంది. మ‌రికొద్ది నెల‌ల్లోనే ఈ సంఖ్య మ‌రీ పెరిగి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పూర్తిగా వైసీపీతోనే శాస‌న మండ‌లి నిండిపోతుంది. దీంతో ఇక‌, త‌మ‌కు తిరుగులేద‌ని.. వైసీపీ నాయ‌కులు కూడా ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే.. ఇంత‌లోనే టీడీపీ ఎంపీ.. క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్‌.. మండ‌లి ర‌ద్దు తీర్మానం అంశాన్ని రాజ్య‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. దీనికి కేంద్రం ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది. ర‌ద్దు తీర్మానాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్లడించింది.

దీంతో ఒక్క‌సారిగా వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్ట‌డం మొద‌లైంది. దీనిపై ఇప్పుడు ఏం చేయాలి.. మండ‌లి ర‌ద్ద‌యితే.. మొత్తం వైసీపీ నేత‌ల‌కు ఇత‌ర ప‌ద‌వులు కేటాయించ‌డం క‌ష్టం. అలాగ‌ని ర‌ద్దు తీర్మానాన్ని వెన‌క్కి తీసుకోమ‌ని కోరితే.. అది మ‌రింత అవ‌మానం.. మొత్తంగా కేంద్రం జ‌గ‌న్‌ను మ‌రోసారి ఇరికించేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.