మోత్కుప‌ల్లి దూకుడు బాగానే ఉంది కానీ అక్క‌డుంది కేసీఆర్

తెలంగాణ రాజ‌కీయాల్లోని సీనియ‌ర్ నేత‌ల్లో ప్ర‌స్తుతం ఏ పార్టీలో లేని మోత్కుపల్లి నర్సింహులు ఒక‌రు. ఇటీవ‌లే బీజేపీకి రాజీనామా చేసిన ఆయ‌న టీఆర్ఎస్ వైపు చూస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఈ విష‌యంలో ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. ఓ వైపు ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే మోత్కుప‌ల్లి మాత్రం ఊహించ‌ని రీతిలో ముందుకు సాగుతున్నారంటున్నారు. దానికి కార‌ణం తాజాగా మోత్కుపల్లి చేసిన కామెంట్లు. టీఆర్ఎస్ నేత‌గానే, ఇంకా చెప్పాలంటే ముఖ్య నేత‌ల్లో ఒక‌రిగా ఆయ‌న మాట్లాడార‌ని చెప్తున్నారు.

తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుప‌ల్లి న‌ర్సింహులు దళితులను కించపరిచేలా ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్ రెడ్డి చాట్ చేశార‌ని ఆరోపించారు. దళితులను అసభ్య పదజాలంతో దూషించాడ‌ని పేర్కొంటూ….తమ జాతిని అవమానపరచడానికి అతనెవరంటూ మోత్కుప‌ల్లి నిలదీశారు. హుజురాబాద్ లో దళిత బంధు పై ప్రచారం చేస్తానని, ఈటల రాజేందర్ ను ఓడిస్తానని పేర్కొన‌డ‌మే కాకుండా డిపాజిట్ కూడా రాకుండా చేస్తానని మోత్కుపల్లి సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఈటల రాజేందర్ కబ్జా చేసిన భూముల దగ్గర ధర్నా చేస్తానని, ఈటల భూముల్లో జెండాలు పాతుతామని చెప్పారు.

దళిత బంధు తో ఎంతో మేలు జరుగుతుందని పేర్కొంటూ తన సంపూర్ణ మద్దతు సీఎం కేసీఆర్ కే ఉంటుందని మోత్కుప‌ల్లి చెప్పారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా పక్క దారి పట్టకుండా డైరెక్ట్ గా వారి ఖాతా లో వేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. త‌మ కోసం, త‌మ జాతి కోసం పని చేస్తున్న నాయకుడు అయిన కేసీఆర్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా దండోరా వేసి ప్రచారం చేస్తానని అన్నారు. దళిత బంధు పథకం.. గొప్ప పథకం అని, ఈ పథకం అమలు కోసం ఎంతైనా ఖర్చు పెడుతామని చెప్పారు. దళిత ఇండ్ల విషయంలో కూడా ఆలోచన చేస్తాం అన్నారు. ఉద్యోగ కల్పన కోసం 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కాగా, ఇటు ప్ర‌భుత్వంలో అటు పార్టీలో కూడా భాగ‌స్వామ్యం కాకుండానే నిధుల ఖ‌ర్చు, ఉద్యోగాల క‌ల్ప‌న వంటి విష‌యాలపై మోత్కుప‌ల్లి చేసిన కామెంట్లు చ‌ర్చ‌కు తెర‌లేపుతున్నాయి.