దాచాలంటే దాగ‌దులే.. ‘కాగ్‌’ చెప్పేసిన ఏపీ గుట్టు!

ఏపీ అప్పుల గుట్టు… దాచాలంటే.. దాగ‌దులే.. అంటోంది కేంద్ర ప్ర‌భుత్వ గ‌ణాంకాలు, అంచనాల సంస్థ‌.. కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్‌. ఏపీ అప్పులపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. కాగ్ మ‌రో బాంబు పేల్చింది. ఏపీ అప్పుల గుట్టును ర‌ట్టు చేసింది. ఏపీ ఏవిధంగా అప్పులు చేస్తోంది? ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇత‌ర రాష్ట్రాల ప‌రిస్థితి ఎలా ఉంది? ఏపీ ప‌రిస్థితి ఎలా ఉంది..? వంటి అనేక విష‌యాల‌ను గుదిగుచ్చి బ‌హిర్గ‌తం చేసింది. దీని ప్ర‌కారం.. ఆరు మాసాల్లో చేయాల్సిన అప్పుల‌ను ఏపీ.. ఒక్క నెల‌లోనే చేసేసిందట.

ఆరు మాసాల అప్పు.. ఒక్క‌నెల‌లోనే

ఒకింత చిత్రంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని గ‌ణాంకాల‌తో స‌హా లెక్క‌లు చూపించి.. చెళ్లుమ‌నేలా చేసింది కాగ్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.19,717 కోట్లను రుణాల రూపంలో సమీకరించుకుని ఖర్చు చేసింది. ఏడాది మొత్తం మీద రూ.37,079 కోట్లు రుణంగా బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 53.18 శాతం (అంటే ఆర్నెల్ల అప్పు) తొలి నెలలోనే ప్రభుత్వం తీసుకుందని కాగ్‌ పరిశీలనలో తేల్చింది. గతేడాది అది 34.57 శాతంగా ఉందని పేర్కొంది.దీనిని తీవ్రంగానే భావించాల్సి ఉంటుంద‌ని కాగ్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అప్పులు ఆకాశానికి

ప్రతి నెలా ఏపీ ప్రభుత్వ లెక్కలను కాగ్‌ పరిశీలిస్తోంది. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత అప్పు చేసింది, రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు ఎంతెంత అనేది తేలుస్తుంది. అలాగే ఏప్రిల్‌ నెల లెక్కలను తాజాగా వెల్లడించింది. నెలనెలా కాగ్‌ విడుదల చేసే ఈ లెక్కలనే నికర రుణపరిమితి పరిశీలనకు ప్రాతిపదికగా తీసుకుంటామని కేంద్రం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఏప్రిల్‌ నెలలో చేసిన అప్పులో ప్రజా రుణం కింద రూ.3,926.33 కోట్లు, ప్రజా పద్దుగా ఉన్న రూ.15,861 కోట్లు కలిసి ఉంది. ఇలా వచ్చిన మొత్తంలో రూ.73.47 కోట్లు నగదు నిల్వగా ఉండటంతో మొత్తం రుణం రూ.19,714.04 కోట్లుగా లెక్క కట్టారు.

ఆదాయం పాతాళానికి!

ఏప్రిల్‌లో పన్నుల రాబడి మరీ తగ్గిపోయింది. కేవలం రూ.7,738 కోట్లే దక్కింది. ఇందులో జీఎస్టీ రూ.2,866.14 కోట్లు వచ్చింది. కేంద్ర సాయం రూ.3,630 కోట్లతోపాటు పన్నేతర ఆదాయమూ కలిపితే అది రూ.11,616 కోట్లకు చేరింది. అదే సమయంలో రాష్ట్రంలో ఏప్రిల్‌లో రూ.31,311 కోట్లు ఖర్చు చేశారు. దీనిలో రాబడి రూపేణా వచ్చింది కేవలం 37 శాతమే. అప్పులు, ఇతరత్రా రుణాల రూపంలో సమీకరించింది సుమారు 63 శాతం ఉంది.

ఏపీనే అప్పుల కుప్ప‌..

అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వ‌రుస‌లో నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌నెల‌లో చేసిన అప్పుల్లో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ 19 వేల 714 కోట్ల‌తో ముందు నిల‌వ‌గా.. పొరుగు రాష్ట్రం తెలంగాణ 1925 కోట్లతో 9వ స్థానంలో ఉంది. ఇక‌, కేర‌ళ 14 వేల పైచిలుకు కోట్ల‌తో రెండో ప్లేస్‌లోను, రాజ‌స్థాన్ 7 వేల కోట్లతో మూడోస్థానంలోను నిలిచింది. సో.. మొత్తానికి ఏపీ స‌ర్కారు చాలానే ఘ‌న కార్యం చేస్తోంద‌ని.. కాగ్ ఈస‌డించ‌డం గ‌మ‌నార్హం.