ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకుల పాలిటిక్స్ లొల్లి ?

రాజ‌కీయాలంటే.. రాజ‌కీయాలే..! అది ఎగ‌స్పార్టీ వాళ్ల‌యినా.. సొంత కుటుంబ స‌భ్యులైనా.. అంతే! త‌మ్ముడు త‌మ్ముడే పేకాట పేకాటే! అన్న చందంగా.. రాజకీయాలు కూడా మారిపోయాయి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం.. ర‌మేష్ రాథోడ్ కుటుంబంలో రాజ‌కీయ లొల్లి చోటు చేసుకుంది. తండ్రి వార‌స‌త్వంగా.. రాజకీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న కుమారుడు రితేష్ రాథోడ్‌కు.. ర‌మేష్‌కు ఇప్పుడు ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో ఇక్క‌డ పొలిటిక‌ల్ వార్ ఎలాంటి మ‌లుపు తిరుగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పారు ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన ర‌మేష్ రాథోడ్‌. జ‌డ్పీ చైర్మ‌న్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న భార్య సుమ‌న్ రాథోడ్ సైతం ఖ‌నాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నిక‌ల్లో ఆదిలాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ర‌మేష్ వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రితేష్ కూడా టీడీపీ త‌రఫునే 2014లో ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. ఈయ‌న కూడా ఓడిపోయారు. దీంతో టీడీపీకి రాం రాం చెప్పారు.

ఈ క్ర‌మంలోనే టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. అయితే.. 2018 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌ఫున వీరికి ఇద్ద‌రికీ కూడా టికెట్లు ద‌క్క‌లేదు. దీంతో తండ్రీ కుమారుడు క‌లిసి వెంట‌నే కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో ఖానాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌మేష్ పోటీ చేసిన‌ప్ప‌టికి .. విజ‌యంద‌క్కించుకోలేక పోయారు. త‌ర్వాత కొన్ని నెల‌ల‌కు వ‌చ్చిన 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ర‌మేష్‌.. ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. మ‌రోసారి ప‌రాజ‌యం పాల‌య్యారు. అయితే.. ఆ ఎన్నిక‌ల్లో రితేష్ పోటీకి దూరంగా ఉన్నారు.

ఇక‌, ఇటీవ‌ల రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవ‌డం.. కాంగ్రెస్ ఒకింత వెన‌క‌బ‌డిన‌ట్టు అనిపించ‌డంతో ర‌మేష్ రాథోడ్‌.. మ‌ళ్లీ జంప్ చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు తండ్రిని అనుస‌రిస్తున్న రితేష్ మాత్రం కాంగ్రెస్‌ను వ‌దిలేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను కాంగ్రెస్ త‌ర‌ఫున ఖానాపూర్ నుంచి పోటీ చేస్తాన‌ని కూడా రితేష్ చెబుతున్నారు.

వాస్త‌వానికి ఇద్ద‌రూ కాంగ్రెస్‌లోనే ఉంటే.. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ల నుంచి పోటీ చేసే అవ‌కాశం ద‌క్కించుకోవ‌చ్చ‌న్న‌ది రితేష్ వ్యూహం. కానీ, ర‌మేష్ మాత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో అవ‌స‌రమైతే.. తండ్రిపై అయినా.. పోటీ చేస్తాన‌ని రితేష్ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ తండ్రీ కొడుకుల యుద్ధం ఏదిశ‌గా సాగుతుందో చూడాలి.