కారులో వ‌చ్చి.. హ‌త్యాయ‌త్నం చేశార‌ట‌.. ఇదో వింత కేసు గురూ!

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై కృష్ణాజిల్లా పోలీసులు ఒక చిత్ర‌మైన కేసు న‌మోదు చేశారు. ఆయ‌న హ‌త్యాయ‌త్నం చేశార‌ట‌. అది కూడా దాదాపు పాతిక ల‌క్ష‌ల కారులో తెల్ల‌టి దుస్తుల్లో వ‌చ్చి.. బ‌హిరంగంగానే వైసీపీ నేత‌ను హ‌త్య చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఇదీ.. ఏపీ పోలీసులు చేసిన అభియోగం. కాదు.. అటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌ కేసు కూడా న‌మోదు చేశారు. నిజానికి అటెంప్టివ్ మ‌ర్డ‌ర్ కేసంటే.. ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసే స‌గ‌టు జీవుల‌ను ఉద్దేశించి.. కృష్ణా జిల్లా పోలీసులు ‘ఔన‌నే’ అంటున్నారు.

ఏం జ‌రిగింది?

కొండపల్లి అటవీ ప్రాంతంలో.. అక్రమంగా గ్రావెల్‌ తవ్వుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌.. అటవీ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పరిశీలన అనంతరం తిరిగి వస్తుండగా.. గడ్డమణుగ గ్రామం వద్ద.. దేవినేని ఉమా వాహనంపై అకస్మాత్తుగా వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. పెద్దఎత్తున అల్లరి మూకలు రాళ్లు విసురుతూ అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉమ కారుతోపాటు పలు వాహనాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు… వైసీపీ శ్రేణులను ప్రతిఘటించటం బాహాబాహీకి దారితీసింది.

గృహ‌నిర్బంధాలు

పోలీసులు అక్కడికి చేరుకుని… లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి ఉమా వాహనాన్ని పంపించేశారు. దాడికి దిగనవారిని పోలీసులు అరెస్టు చేయకపోవటంపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తీరును నిరసిస్తూ.. జి.కొండూరు పోలీస్‌ స్టేషన్‌ వద్ద కారులోనే ఆందోళనకు దిగారు. ఉమాకు మద్దతుగా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున బయలుదేరిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను… పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తంగిరాల సౌమ్య, శ్రీరాంతాతయ్య, బుద్ధా వెంకన్న, కొణకళ్ల నారాయణను గృహనిర్బంధంలో ఉంచారు.

ఉమా ప‌ట్టు..
పోలీసులు తన నుంచి ఫిర్యాదు తీసుకునే వరకూ స్టేషన్‌ నుంచి కదిలేది లేదని ఉమా నిరసన కొనసాగించారు. దాదాపు ఆరుగంటలపాటు కారులోనే నిరసన తెలిపిన ఉమాను.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. కారు అద్దం ధ్వంసం చేసి.. లోపలి నుంచి తలుపు తీసి.. ఉమాను బయటకులాగారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు వాహనంలో పెద్దపారుపూడి తరలించారు.

తెల్లారేస‌రికి మారిన సీన్‌..

సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే.. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ దాడి చేయించారని దేవినేని ఉమా ఆరోపించారు. తన వ్యాఖ్యలను బలపరుస్తూ.. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌ మాట్లాడిన వీడియోను నేతలు విడుదల చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణతో దేవినేని ఉమాను అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. కానీ, తెల్లారే స‌రికి మాత్రం ఈ మొత్తం వ్యూహం మారిపోయింది. దేవినేనిపై హ‌త్యాయ‌త్నం(ఎవ‌రిమీద చేశారో చెప్పాల్సి ఉంది) కేసుతో పాటు అట్రాసిటీ కేసు(ద‌ళితుల‌ను దూషించార‌ట‌) పెట్టారు. సో.. ఇవ‌న్నీ చూస్తే.. జ‌గ‌న్ పాల‌న‌లో ఏదైనా సాధ్య‌మే అనే మాటవినిపిస్తోంది. కొస‌మెరుపు ఏంటంటే.. ఇవ‌న్నీ.. న్యాయ స‌మీక్ష‌కు నిల‌బ‌డేవేకావ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అక్క‌డ జ‌గ‌న్‌కు.. మొట్టి కాయ‌లు త‌ప్ప‌వ‌ని.. చెబుతున్నారు.