ఆ సినిమా ఏమైంది పూరీ?

టాలీవుడ్లో ఎందరో హీరోలకు మంచి బ్రేక్ ఇచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్. మామూలు హీరోలను స్టార్లను చేసినా.. స్టార్లను సూపర్ స్టార్లను చేసినా ఆయనకే చెల్లింది. రవితేజ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌ లాంటి స్టార్లకు వారి వారి కెరీర్లలో ఆయా సమయాల్లో బిగ్గెస్ట్ మూవీస్‌ను అందించిన ఘనత పూరీది. రామ్ చరణ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది కూడా పూరీనే.

ఐతే ఇంతమంది స్టార్లకు బ్రేక్ ఇచ్చిన పూరీ తన కొడుకు పూరి ఆకాశ్‌ కెరీర్‌ను మాత్రం సెట్ చేయలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ అనే అనవసర సినిమా చేసి దెబ్బ తిన్న ఆకాశ్‌ను.. ఆ తర్వాత పూరీనే ‘మెహబూబా’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేశాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయింది. ఐతే తాను సరైన ఫాంలో లేననో.. లేక బిజీగా ఉండటం వల్లో ఆకాశ్ తర్వాతి సినిమా దర్శకత్వ బాధ్యతలు తన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించాడు.

పూరీ కథతోనే తెరకెక్కిన ఆ చిత్రమే.. రొమాంటిక్. ఆకాశ్ సరసన కేతిక శర్మ అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించింది. గత ఏడాది రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్, ఒక పాట ఘాటు ఘాటుగా ఉండి కుర్రాళ్ల దృష్టిని ఆకర్షించాయి. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది, రిలీజే తరువాయి అన్నారు. కానీ చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఈ సినిమా సంగతి అతీ గతీ లేదు.

ఈ మధ్యనే ఆకాశ్ ‘చోర్ బజార్’ అంటూ కొత్త సినిమా మొదలుపెట్టాడు. ‘జార్జిరెడ్డి’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ఆకాశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. అది చూస్తే పూరి మంచి ఫాంలో ఉండగా తీసిన సినిమాలు గుర్తుకొస్తున్నాయి.

ఈ సినిమా కాస్త ప్రామిసింగ్‌గానే కనిపిస్తోంది. చూస్తుంటే ఈ చిత్రమే ముందు ప్రేక్షకులను పలకరించేలా ఉంది. ‘రొమాంటిక్’ సంగతి ఏమైందో కూడా తెలియట్లేదు. ఔట్ పుట్ బాగా లేదని, ఆకాశ్ కెరీర్‌కు ప్రతికూలం అవుతుందని ఈ సినిమాను పక్కన పెట్టేశారనే సందేహాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.