సీఎం జగన్ ను ఢిల్లీకి రమ్మంటూ ఫోన్ కాల్?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనూహ్యంగా ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లుగా చెబుతున్నారు. రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలు.. దాని పరిష్కారం కోసం అదే పనిగా సంప్రదింపులు జరిపినా.. సానుకూల స్పందన అంతగా ఉండని కేంద్రం నుంచి తాజాగా వచ్చిన ఫోన్ కాల్ తెలుగు రాజకీయ వర్గాల్లో చర్చకు తెర తీస్తుందని చెప్పాలి.

మోడీ మాష్టారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాష్ట్రాలకు.. కేంద్రానికి మధ్యకాస్త గ్యాప్ పెరిగిందనే చెప్పాలి. గతంలో ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని అపాయింట్ మెంట్ కోరితే..గంటల్లో డిసైడ్ చేసే వారు. కానీ.. మోడీ జమానాలో అందుకు భిన్నమైన పరిస్థితి.

అపాయింట్ మెంట్ కోరిన తర్వాత టైం ఇచ్చి మరీ రద్దు చేసిన సందర్భాలు ఎన్నో. అలాంటిది అందుకు భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రికి ఢిల్లీ నుంచి సెలవు రోజైన ఆదివారం వచ్చినట్లుగా చెబుతున్న ఫోన్ కాల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం తర్వాత ఎప్పుడైనా ఢిల్లీకి రావొచ్చన్న మాట సీఎం జగన్ చెవిన వేసినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ నెలాఖరు లోపు సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే వీలుందన్న మాట వినిపిస్తోంది.

తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని.. అనంతరం మరికొందరు మంత్రుల్ని కలిసే వీలుందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు అందరి చూపు పడేలా చేస్తున్నాయి. ఇప్పటికే పెగాసస్ ఉదంతం కేంద్రంలోని మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకోవటం ద్వారా.. కేంద్రం మీద మరింత ఒత్తిడిని పెంచాలన్న యోచనలో ఉన్న వేళ.. తనకు ప్రత్యక్షం కానీ పరోక్షంగా కానీ అండగా నిలిచే రాజకీయ పార్టీలను బుజ్జగించే పనిని కేంద్రం షురూ చేసినట్లుగా చెబుతున్నారు.

ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికే కేంద్రం తేల్చేసిన నేపథ్యంలో.. ఆ విషయంలో చేసేదేమీ లేదన్న మాట వినిపిస్తోంది. అది మినహా మిగిలిన కొన్ని అంశాల విషయంలో కేంద్రం రాజీ ధోరణిని ప్రదర్శించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదాపై ఈసారి పార్లమెంటు సమావేశాల్లో వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు నిఘా యాప్ లతో విపక్షాల గొంతు నొక్కేస్తుందన్న విమర్శ అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. వైసీపీ ఎంపీల్ని బుజ్జగించేందుకు వీలుగా జగన్ ను హస్తినకు పిలిపించి ఉంటారని చెబుతున్నారు.

ఇప్పటివరకు సీఎం హోదాలో జగన్ చేసిన ఢిల్లీ టూర్లకు భిన్నంగా తాజా టూర్ ఉంటుందన్న మాట పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఢిల్లీకి ఎప్పుడు వెళతారన్న దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. అనూహ్య రీతిలో తెర మీదకు వచ్చిన ఈ ఢిల్లీ టూర్ అంతో ఇంతో రాజకీయ సమీకరణల్ని మార్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.