‘జాతీయ గీతం’ స‌రే.. ‘జ‌న‌గీతం’ వినండి మోడీ జీ.. నెటిజ‌న్ల ఫైర్‌

తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి.. మ‌న్‌కీ బాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. త‌న మ‌న‌సులోని భావాల‌ను ప్ర‌జ‌ల‌కు పంచుకునే ఈ కార్య‌క్ర‌మం ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ప్ర‌తిసారిలాగే.. ఈ ద‌ఫా కూడా మోడీ.. త‌న మ‌న‌సులోని మాటలే చెప్పారు త‌ప్ప‌.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏముందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌లే క‌పోయార‌నేది విశ్లేష‌కుల మాట‌. మ‌రీ ముఖ్యంగా గ‌డిచిన నెల‌కు, ప్ర‌స్తుతానికి మ‌ధ్య ద్ర‌వ్యోల్బ‌ణం.. దేశంలో పెరుగుతోంది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ర‌య్ ర‌య్య‌న దూసుకుపోతుండ‌డంతో అన్ని ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి.

ఇదే విష‌యంపై దేశ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే.. ఈ విష‌యాన్ని మోడీ.. ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. పోనీ.. ఎప్పుడు త‌గ్గుతాయో.. చెప్ప‌లేక పోయారు. ఎందుకు పెరుగుతున్నాయో.. వివ‌రించి ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు అస‌లు ‘కిటుకు’ అర్థ‌మ‌యి ఉండేది. కానీ, ఆయ‌న ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. ‘కీల‌కం పేరు’తో మూడు అంశాల‌ను ఎంచుకున్నారు.

1) ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని మోడీ కోరారు. ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైందని, అందరూ తమ తమ టీమ్‌తో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

2) రాబోయే ఆగస్టు 15 చాలా స్పెషల్ అని మోడీ చెప్పుకొచ్చారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నామని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని అన్నారు. ఆగస్టు 15న ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయ గీతాన్ని సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి పాడే బృహత్ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని ప్రకటించారు. దీని కోసం ఓ వెబ్‌సైట్ కూడా రూపొందించామని rashtragaan.in అనే వెబ్‌సైట్ రూపొందించామని పేర్కొన్నారు.

3) దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి భయాన్ని వీడండి. వ్యాక్సిన్ తీసుకోండి. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఇది చాలా చిన్నది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్‌ను నిరాకరించడం చాలా అపాయం. వ్యక్తిగతంగానూ క్షేమం కాదు. సమాజపరంగా కూడా క్షేమం కాదు.. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని విజ్ఞప్తి చేశారు.

జ‌న్‌కీ బాత్ ఇదీ..
మోడీ మ‌న్‌కీ బాత్‌పై జ‌నాలు చాలా సీరియ‌స్‌గానే రియాక్ట్ అయ్యారు. సాయంత్రం మూడు గంట‌ల నుంచి ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో కామెంట్ల‌ను నిలిపి వేయ‌డాన్ని బ‌ట్టి.. జ‌నాలు ఏమేర‌కు స్పందించారో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా.. జాతీయ గీతం ఆలపించి రికార్డు సృష్టించాల‌న్న‌.. మోడీపై చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ”జాతీయ గీతం స‌రే.. మోడీజీ.. జ‌న గీతం వినిపిస్తున్నాం.. వింటున్నారా? ఈ ధ‌ర‌లేంటి? ఏం తినాలి? ఎలా బ‌త‌కాలి? క‌రోనా మిగిల్చిన క‌న్నీళ్ల త‌డి ఇంకా ఆరిపోలేదు” అంటూ..చాలా మంది ఇదే కోణంలో మోడీని సూటిగా ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా.. మోడీ త‌న వైఖ‌రి మార్చుకుంటారో లేదా.. గ‌తంలో దేశం వెలిగిపోతోంది.. అన్న‌ట్టుగానే.. ఇప్పుడు త‌న పాల‌న కూడా వెలిగిపోతోంద‌నే భ్ర‌మ‌లో నే ఉండి చేతులు కాల్చుకుంటారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొస‌మెరుపు ఏంటంటే.. కాంగ్రెస్ నేత‌.. రాహుల్ ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.