వ్యూహ‌క‌ర్త కోసం టీడీపీ వేట‌.. నిజ‌మేనా?

టీడీపీకి వ్యూహ‌క‌ర్త కావాలా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య తీరం వైపు న‌డిపించే వ్యూహ‌క‌ర్త కోసం అన్వేష‌ణ సాగుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు సీనియ‌ర్లు. పైకి మాత్రం చాలా గుంభ‌నంగా ఉన్న‌ప్పటికీ.. ఈ విష‌యంపై ఇప్ప‌టికే.. ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌ల‌తో పార్టీ అధినేత ఆదేశాల మేర‌కు నారా లోకేష్‌.. చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఎన్నికల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచేలా.. టీడీపీ ల‌క్ష్యం నిర్ణయించుకుంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలను తెర‌మీదికి తెచ్చింది. ఒక‌టి అమ‌రావ‌తిని కాపాడ‌డం, రెండు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టిన టీడీపీ అనుకూల వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డం.

ఈ రెండు ల‌క్ష్యాలు సాధించాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు ముఖ్య‌మని టీడీపీ నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తి విష‌యంలో జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తోంది. దీంతో మూడు రాజ‌ధానుల ప్ర‌క్రియ‌కు బ్రేకులు ప‌డ్డాయ‌నే చెప్పాలి. దీనిని మ‌రో రెండేళ్ల పాటు ఇలానే కొన‌సాగించ‌డం ఒక వ్యూహ‌మైతే.. మ‌రో వ్యూహం పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఏమీ సాదాసీదాగా జ‌రిగేలా క‌నిపించ‌డం లేదు. వైసీపీ నేత‌ల‌ను ఢీ కొన‌డం.. అంటే ఇప్పుడున్న టీడీపీకి అంత ఈజీకాదు.

అంతేనా.. ప్ర‌జ‌ల్లో ఉన్న సంక్షేమ ఫ‌లాల సానుభూతి నుంచి వైసీపీని వేరు చేయ‌డం అనేది టీడీపీకి పెద్ద స‌వాలుగా మారింది. ఈ క్ర‌మంలో కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసే వ్యూహ‌క‌ర్త అత్యంత అవ‌స‌రంగా మారింద‌నే వాద‌న సీనియ‌ర్ల నుంచి కూడా వినిపిస్తోంది. పాద‌యాత్ర‌లు, ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌డం అనేవి పాత వ్యూహాల‌ని.. వీటికి మించిన వ్యూహాల‌తో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉందని.. పార్టీలో ఇటీవ‌ల చ‌ర్చ‌ల ద్వారా నేతలు చంద్ర‌బాబు వ‌ర‌కు తీసుకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన‌ స‌ల‌హాదారు కోసం వేట సాగించాల‌ని నిర్ణ‌యించారు.

నిజానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాబిన్‌స‌న్ అనే వ్య‌క్తిని స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. అయితే.. ఆయ‌న క‌న్నా.. చంద్ర‌బాబు వ్యూహాలే ప‌నిచేశాయి. ఇక‌, ఇప్పుడు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఢీ కొట్టేందుకు.. బ‌ల‌మైన ప‌క్షంగా మారిన వైసీపీని ఎదుర్కొనేందుకు మ‌రింత ప‌క‌డ్బందీగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యిం చుకున్నారు. ఈ క్ర‌మంలోనే వ్యూహ‌క‌ర్త కోసం వేట సాగిస్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ప్ర‌స్తుతం రాబిన్‌స‌న్ సేవ‌లు.. వినియోగించుకుంటూనే.. మ‌రో కీల‌క స‌ల‌హాదారు విష‌యాన్ని సీరియ‌స్‌గానే ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి టీడీపీని ఎవ‌రు న‌డిపిస్తారో.. చూడాలి.