సెప్టెంబర్ నుంచి చిన్నారులకు వ్యాక్సిన్..!

భారత్ లో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీంతో.. చిన్నారులకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా గుడ్ న్యూస్ తెలియజేశారు.

భారత్‌లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌లు సెప్టెంబర్‌ నుండి ఆందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది అతి ముఖ్యమైన చర్య అని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. జైడస్‌ చిన్నారులపై ట్రయల్స్‌ నిర్వహించిందని, అత్యవసర అనుమతుల కోసం వేచిచూస్తుందని అన్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ ఆగస్టు, సెప్టెంబర్‌లోపు పూర్తవుతాయని, వెంటనే అనుమతులు పొందవచ్చని అన్నారు.

అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదించిందని చెప్పారు. దీంతో సెప్టెంబర్‌ నుండి చిన్నారులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌లను అందించామని, ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

అయితే థర్డ్‌వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో.. చిన్నారులకు వ్యాక్సిన్‌లను అందించడంపై స్పష్టతనివ్వలేదు. 11-17 ఏళ్లలోపు పిల్లలతో కలిసి జీవించే వృద్ధుల్లో వ్యాధి సోకే ప్రమాదం 18-30 శాతం పెరుగుతోందని ఈ వారం ప్రారంభంలో లాన్సెట్‌ ఒక అధ్యయనాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గులేరియా స్పందిస్తూ.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి సొకే ప్రమాదం అధికంగా ఉందని అన్నారు.

చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. స్వల్పంగా వ్యాధి సోకిన చిన్నారులు వృద్ధులకు వ్యాప్తి చేయవచ్చని .. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.