టీడీపీ ఆశలు వదిలేసుకున్నదా ?

భారతరత్న పురస్కారంపై తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని చంద్రబాబునాయుడు అండ్ కో కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే మరి స్వయంగా అన్నగారి కొడుకైనా బాలయ్య పురస్కారాన్ని కాలిగోరు, కాలి చెప్పుతో సమానమని వర్ణించటం వివాదాస్పదంగా మారింది. అంటే బాలయ్య వ్యాఖ్యలను బట్టి ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం రాదని బాలయ్య డిసైడయ్యారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

నందమూరి నటసింహం, టీడీపీ ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతరత్న పురస్కారం తన తండ్రి ఎన్టీయార్ కాలి గోటితో, కాలిచెప్పుతో సమానమని అవమానకరంగా మాట్లాడారు. ఒకవైపు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ పదే పదే కేంద్రప్రభుత్వాన్ని అడుగుతోంది. ఇదే సమయంలో అదే పురస్కారంపై బాలకృష్ణ నోటికొచ్చినట్లు మాట్లాడటం గమనార్హం.

భారతరత్న పురస్కారాన్ని బాలయ్య తప్పుగా మాట్లాడారంటే దేశాన్ని కించపరిచినట్లుగానే భావించాలి. ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రతి ఏడాదికి మూడుసార్లు టీడీపీ తప్పకుండా అడుగుతుంటుంది. మొదటిసారేమో ఎన్టీయార్ జయంతి రోజున. రెండోసారేమో వర్దింతిరోజున. ఇక మూడోసారి మహానాడు సందర్భంలో. అధికారంలో ఉన్నపుడు అడగకుండా ప్రతిపక్షంలో ఉన్నపుడే చంద్రబాబు, టీడీపీ నేతలకు ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం గుర్తుకొస్తుంటుంది.

ఇలాంటి నేపధ్యంలోనే ఓ టీవీ చానల్ తో మాట్లాడుతు భారతరత్న పురస్కారం తన తండ్రి కాలిగోటితో, చెప్పుతో సమానమని అనటం వివాదాస్పదంగా మారింది. ఇది నిజమే అయితే మరి బాలయ్య పాల్గొనే జయంతి, వర్దంతి, మహానాడుల్లో టీడీపీ ఎందుకని పదే పదే పురస్కారం కోసం డిమాండ్ చేస్తోందో అర్ధం కావటంలేదు. గతంలో కూడా ఓ ఇంటర్వ్యూలో తమది సపరేటు బ్లడ్డు, సపరేటు బ్రీడంటు నోరుజారిన విషయం తెలిసిందే.

తాజాగా బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. భారతరత్న పురస్కారాన్ని అవమానించటమంటే దేశాన్ని అవమానించటమే అంటున్నారు. ఇదే సందర్భంలో గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్న పీవీ నరసింహారావు, వాజ్ పేయి, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళను కూడా బాలయ్య అవమానించినట్లే అని నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఏదేమైనా మాట్లాడేటపుడు బాలయ్య కాస్త జాగ్రత్తగా ఉండకపోతే సమస్యలు రావటం ఖాయమని తెలుసుకోవాలి.