‘నారప్ప’ థియేటర్లలో రిలీజై ఉంటే..


విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఆన్ లైన్లో రిలీజవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ కరోనా పుణ్యమా అని ఆయన సినిమా ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్ ద్వారా మూడు రోజుల కిందట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

తమిళ వెర్షన్ నుంచి ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేసినప్పటికీ.. అక్కడున్న ఫీల్ తెలుగులో లేకపోయింది. ప్రేక్షకుల స్పందన చూస్తే.. ఈ చిత్రాన్ని డిజిటల్లో రిలీజ్ చేసి మంచి పని చేశారు అనే అభిప్రాయం కలుగుతోంది. నిర్మాతలు సురేష్ బాబు, కలైపులి థాను ఓటీటీ బాట పట్టడం ద్వారా మంచి నిర్ణయమే తీసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తే పరిస్థితి ఎలా ఉండేదన్నది ఆసక్తికరం.

‘నారప్ప’ను ఓటీటీలో రిలీజ్ చేయడం ద్వారా నిర్మాతలకు రూ.17 కోట్ల లాభం వచ్చినట్లు చెబుతున్నారు. ఒకవేళ ‘నారప్ప’ కొంచెం ఆగి థియేటర్లలోకి వచ్చి ఉంటే.. ఈ మాత్రం లాభం వచ్చేది కాదా అన్నది ప్రశ్న. ‘నారప్ప’కు నెగెటివ్ రివ్యూలు వచ్చి ఉండొచ్చు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించి ఉండొచ్చు. కానీ ఇది ఒక మాస్ సినిమా.

ప్రి రిలీజ్ బజ్ కూడా బాగానే కనిపించింది. ఇలాంటి చిత్రాలకు టాక్‌తో సంబంధం లేకుండా మాస్ నుంచి మంచి స్పందన ఉంటుంది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చి ఉండేవి. టాక్ ఎలా ఉన్నప్పటికీ రూ.20-25 కోట్ల మధ్య షేర్ వచ్చే ఛాన్స్ ఉండేది. థియేటర్లలో ఈ మాత్రం వసూళ్లు రాబట్టుకున్నాక డిజిటల్ రైట్స్ అమ్మి ఉంటే ఓ మోస్తరు రేటే పలికి ఉండేది. ఆ డబ్బులు కూడా కలుపుకుని ఉంటే సినిమాకు ఇప్పుడంటున్న దాని కంటే ఎక్కువ లాభమే వచ్చేదేమో. కాబట్టి ఓటీటీలో వదిలేసి చేతులు దులిపేసుకున్నారు, లాభ పడ్డారు అనుకోవడానికేమీ లేదు.