పెగాసస్సే ప్రతిపక్షాలను కలుపుతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సహజంగానే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకంచేయాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాల ఐక్యతకు ఒకవైపు మమత, మరోవైపు శరద్ పవార్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మమత మాట్లాడుతూ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ప్రతిపక్షాలన్నీ కలవాల్సిన అవసరం వచ్చిందన్నారు. దీనికి ఆధారం ఏమిటంటే చాలామంది ప్రతిపక్ష నేతల మొబైళ్ళపై కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ తో నిఘా పెట్టడమే.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా దేశంలోని 300 మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టిందనే రచ్చ రోజు రోజుకు పెరిగిపోతోంది. దివైర్ అనే మీడియా కథనం ప్రకారం రాహూల్ గాంధి, మమతబెనర్జీ, శరద్ పవార్, చిదంబరం లాంటి అనేకమంది మొబైళ్ళు హ్యాక్ అయ్యాయి. ఇదే విషమమై మమత మాట్లాడుతూ తాను ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బందిగా మారిందని వాపోయారు.

ఈనెల 27-29 మధ్య ఢిల్లీలో విపక్ష నేతల సమావేశం పెడితే బాగుంటుందని మమత సూచించారు. తాను పై తేదీల్లో ఢిల్లీలో ఉంటాను కాబట్టి కాంగ్రెస్, ఆప్, సమాజ్ వాది పార్టీ, అకాలీదళ్, ఎన్సీపీ, శివసేన లాంటి పార్టీల నేతలు సమావేశానికి రావాలని మమత విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రతిపక్షాల నేతల ఆలోచనలు చూస్తుంటే మొబైల్ ఫోన్ నిఘాపై నరేంద్రమోడి సర్కార్ పై మండిపోతున్నారు. అనేక అంశాలపై ఇప్పటికే ప్రతిపక్షనేతల్లో మోడిపై మంటగా ఉంది.

ఇలాంటి నేపధ్యంలోనే తమ మొబైల్ ఫోన్లనే కేంద్రం ట్యాప్ చేసిందన్న విషయం బయటపడటంతో అందరు మోడికి బాగా ఉడికిపోతున్నారు. బహుశా మొబైల్ నిఘా అంశం మీద ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఆశ్చర్యపోక్కర్లేదు. ప్రతిపక్షాల ఐక్యతకు మమత యునైటెడ్ ప్రంట్ అని పేరు కూడా పెట్టారు. అయితే యునైటెడ్ ఫ్రంట్ పేరుతో 1996లోనే 13 పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాబట్టి పేరేది అన్నది ఇక్కడ ప్రధానంకాదు.

నరేంద్రమోడి సర్కార్ కు వ్యతిరరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం అవ్వటమే ముఖ్యమని మమత స్పష్టం చేశారు. కాబట్టి ఐక్యతకు పేరేదైనా పెట్టచ్చు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలో ఇప్పటికే యూపీఏ ఉందన్న విషయం తెలిసిందే. మరి యూపీఏ ఉండగా మరో ఫ్రంట్ కు కాంగ్రెస్ ఎలా అంగీకరిస్తుంది ? పైగా కొత్తగా ఏర్పడాలని కోరుకుంటున్న ఫ్రంట్ కు నాయకత్వం ఎవరిది అనే సందేహం ఉండనే ఉంది. చూద్దాం మమత పిలుపుకు ఎన్ని పార్టీలు స్పందిస్తాయో.