భజరంగి భాయిజాన్.. రాజమౌళి తీసుంటే..?

టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్లో మంచి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొన్ని రోజులకే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసే సల్మాన్‌.. ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్‌కు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతడి తండ్రి, లెజెండరీ రైటర్ సలీమ్ ఖాన్ ఎంతో సంతోషించి విజయేంద్ర ప్రసాద్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే విజయేంద్ర ప్రసాద్.. ముందుగా ఈ కథను రాజమౌళి తీస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. తన కొడుక్కి ఈ కథ కూడా చెప్పాడట. కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో కథను మాత్రం సల్మాన్ ఖాన్‌కు ఇచ్చేయగా.. కబీర్ ఖాన్‌తో డైరెక్ట్ చేయించినట్లు విజయేంద్ర వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ఈ విషయం చెప్పాడు.

సల్మాన్‌కు కథ చెప్పాక.. రాజమౌళికి ‘భజరంగి భాయిజాన్’ స్టోరీ వినిపించానని.. ఆ కథ తన కొడుక్కి కూడా బాగా నచ్చిందని.. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తావా అని అడిగితే మాత్రం తాను చేయనని రాజమౌళి చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఐతే ‘భజరంగి భాయిజాన్’ విడుదలయ్యాక తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనందుకు ఫీలవుతున్నట్లు చెప్పాడని.. రాజమౌళి సరైన మూడ్‌లో లేనపుడు తాను ఈ కథ చెప్పడం తప్పయిందని విజయేంద్ర తెలిపాడు.

‘బాహుబలి’ కోసం ఎర్రటి ఎండలో వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్న సమయంలో తాను అతడికి ఈ కథ చెప్పానని.. బ్యాడ్ మూడ్‌లో ఉండటంతో తాను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయానని రాజమౌళి తనకు తర్వాత చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఇక ఒకప్పుడు రాజమౌళి తన స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునేవాడినని.. కానీ ఇప్పుడు అతడి స్థాయిని తాను అందుకోవడానికి కష్టపడుతున్నానని విజయేంద్ర చెప్పడం విశేషం.