‘హుజురాబాద్ లో వెయ్యిమంది పోటీ’..!

తెలంగాణ రాజకీయాలు మొత్తం ఇప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించి.. తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నాలుచేస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈ ఎన్నికలను ఉద్దేశించి..బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

తమ డిమాండ్స్ పూర్తి చేయకుంటే.. హుజురాబాద్ లో వెయ్యి మంది అభ్యర్థులను పోటీకి దింపుతానని హెచ్చరించారు. ఇంతకీ మ్యాటరేంటంటే… ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్ల కోసం కృష్ణయ్య దీక్ష చేపట్టారు. తొలగించిన 7వేల 600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటేనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే హుజూరాబాద్ ఉపఎన్నికలో వెయ్యి మందితో పోటీ చేస్తామన్నారు. పది వేల మందితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం చేస్తామని హెచ్చరించారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలకంగా ఉండేవారు. అయితే గతేడాది ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. వారి బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. దాదాపు 15 ఏళ్లుగా పనిచేస్తున్నామని.. తమను పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని అప్పట్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు. ఈ కారణంగా ప్రభుత్వం వారిని విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని పోరాటం చేస్తూనే ఉన్నారు.