‘పెగాస‌స్‌’ వెనుక మోడీ చ‌తురంగ వ్యూహమేనా?

పెగాస‌స్‌.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటును కుదిపేస్తున్న స్పైవేర్‌. కేంద్రంలోని మంత్రులు, ప‌లువురు జ‌ర్న‌లిస్టులు, సామాజిక ఉద్య‌మ కారులు, సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల ఫోన్ల‌ను హ్యాక్ చేసి.. స‌మాచారం.. రాబ‌ట్టార‌నేది పెగాస‌స్ పై వ‌స్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ. ఇజ్రాయెల్ కు చెందిన సాంకేతిక సంస్థ పెగాస‌స్‌పై వివాదం ఇప్ప‌టిది కాదు. 2019లోనే వెలుగు చూసింది. అప్ప‌ట్లోనే ఇది వివాదంగా మారి.. పార్ల‌మెంటును కుదిపేసింది. వారాల త‌ర‌బ‌డి.. పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఉద్య‌మించాయి. దీనికి సంబంధించి.. అప్ప‌టి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌.. వివ‌ర‌ణ కూడా ఇచ్చారు.

ఇలాంటి అసంబ‌ద్ధ‌మైన‌, ఆధార‌ర‌హిత‌మైన‌.. విష‌యాల‌పై మా ద‌గ్గ‌ర స‌మాధానం లేద‌ని.. ర‌విశంక‌ర్‌.. స్ప‌ష్టం చేశారు. దీంతో అప్ప‌ట్లో చల్లారిపోయింది. అయితే.. ఆ త‌ర్వాత కూడా పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రిగాయి. అప్ప‌ట్లో క‌రోనాపై విజ‌యం, లాక్ డౌన్ ద్వారా.. దేశంలో(తొలిద‌శ‌) క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం.. వంటివి కేంద్రానికి ప్ల‌స్‌లుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లోనూ.. అంటే.. గ‌త 2020 పార్ల‌మెంటు స‌మావేశాల స‌మ‌యంలోనూ పెగాస‌స్ ఉన్న‌ప్ప‌టికీ.. ఫోన్లు హ్యాక్ అవుతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ముఖ్యంగా దీనికి అస‌లు ప్రాధాన్య‌మే లేకుండా పోయింది.

నిజానికి అప్ప‌ట్లోనూ… ఇప్పుడు ఏ మీడియా అయితే.. పెగాస‌స్‌పై వార్త‌లు రాసిందో.. అప్ప‌ట్లో ఇదే మీడియా రాసుకొచ్చింది. కానీ, అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం ‘క‌రోనా విజ‌యాల‌ను ఎంజాయ్‌’ చేస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యం పెద్ద‌గా ఫోక‌స్ కాలేద‌నే చెప్పాలి.(ఒక‌ర‌కంగా.. దీనికి తొక్కిపెట్టారు) కానీ, ఇప్పుడు అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చింది. అది కూడా బీజేపీ ఎంపీ.. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పెగాస‌స్‌పై వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత‌.. కార్తీ చిదంబ‌రం, డిబేక్ ఒబ్రెయ‌న్‌.. వంటివారు స్పందించారు. దీంతో ఇప్పుడు.. వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో పెగాస‌స్ విష‌యం హాట్ టాపిక్ అయింది.

పార్ల‌మెంటు ప్రారంభ‌మై.. రెండు రోజు పెగాస‌స్‌పై వివాదం రేగ‌డం.. వ‌రుస‌గా స‌భ‌లు వాయిదా ప‌డుతుండ‌డం.. గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలోనే ప‌రిశీల‌కులు.. జాతీయ రాజ‌కీయాల విశ్లేష‌కులు ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేంద్ర స‌ర్కారు.. తీవ్ర చిక్కుల్లో ఉంది. క‌రోనా సెకండ్ వేవ్‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో కేంద్రం పూర్తిగా విఫ‌ల‌మైంది. అదేస‌మ‌యంలో రాష్ట్రాల హ‌క్కుల‌ను కేంద్రం లాగేసుకుంటోంది. పెట్రో ధ‌ర‌లు పెరుగుతున్నా.. చోద్యం చూస్తోంది. క‌రోనా కార‌ణంగా దెబ్బ‌తిన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టేందుకు ఏమాత్రం ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే వాదన కూడా వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాల నుంచి భారీ ఎత్తున సెగ‌లు పుట్ట‌డం ఖాయం. కానీ, ఇదే స‌మ‌యంలో మోడీ.. ఈ ఎదురుదాడి నుంచి పూర్తిగా త‌ప్పించుకున్నారు. ఈ క్ర‌మంలోనే పాత‌చింత‌కాయ వంటి పెగాస‌స్‌ను ఉద్దేశ పూర్వ‌కంగా తెర‌మీదికి తెచ్చార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. మ‌రి మోడీ వ్యూహాన్ని ప్ర‌తిప‌క్షాలు గుర్తించ‌లేక పోయాయా? మోడీ వ్యూహంలో చిక్కుకున్నాయా? అనేది ఆస‌క్తిగా మారింది.