రామ్ కోసం సరైన విలన్

‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ విజయాన్నందుకున్న యువ కథానాయకుడు రామ్ ఆలోచనలు మారిపోయాయి. తన ఇమేజ్‌ను, మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అప్పటికే కమిటైన ‘రెడ్’ సంగతలా వదిలేస్తే.. తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో సెట్ చేసుకున్నాడు.

తమిళ దర్శకుడు లింగుస్వామితో అతను ఓ బహుభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చాలా వరకు ఆర్టిస్టులను వేర్వేరు భాషల వాళ్లకు తెలిసిన వాళ్లను పెట్టుకుంటున్నారు. తెలుగు వాడే అయినప్పటికీ తమిళంలో స్టార్ హీరోగా ఎదగడమే కాక.. దక్షిణాదిన అంతటా మంచి పాపులారిటీ ఉన్న ఆదిని ఈ చిత్రానికి విలన్‌గా ఎంచుకోవడం విశేషం.

ఈ రోజే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆదికి ఫలానా తరహా పాత్రలే చేయాలనే పట్టింపేమీ ఉండదు. హీరోగా మంచి ఫాలోయింగే ఉన్నప్పటికీ క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా చేస్తుంటాడు.

తెలుగులో ‘రంగస్థలం’లో హీరో అన్నయ్య పాత్రలో ఎంత ఆకట్టుకున్నాడో.. ‘సరైనోడు’ విలన్‌గా అంతే ముద్ర వేశాడు. ‘సరైనోడు’లో అతడి విలనీకి ఫిదా అయిన అభిమానులు చాలామందే ఉన్నారు. రామ్‌తో అతడి కాంబినేషన్ ఆసక్తికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా.. ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది.

రెండు వారాల కిందటే హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. అప్పట్నుంచి తరచుగా ఈ చిత్రాన్ని వార్తల్లో నిలబెడుతున్నారు. ఏస్ డైరెక్టర్ శంకర్ ఈ చిత్ర సెట్స్‌ను సందర్శించడం.. అలాగే ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్న లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా పుట్టిన రోజు వేడుకలను సెట్స్‌లోనే జరపడం లాంటి అప్‌డేట్స్ గురించి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ హ్యాండ్సమ్‌ లుక్‌లో కనిపించనున్నాడు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.