ఇండియా విన్.. ఆయనకు బ్యాండ్


అర్జున రణతుంగ.. శ్రీలంకకు వన్డే ప్రపంచకప్ అందించి సంచలనం సృష్టించిన సారథి. ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచిపోయిన రణతుంగ.. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువగా వివాదాలతోనే సావాసం చేశాడు. రాజకీయ నేతగా మారినప్పటికీ రణతుంగ క్రికెట్ వ్యవహారాల గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకు ఇండియా అంటే మహా మంట. ఐపీఎల్‌‌ను చూసి అసూయ చెందుతూ దాని మీద చాలాసార్లు విమర్శలు గుప్పించాడు.

ఇటీవల ఆయన చేసిన ఒక కామెంట్ దుమారం రేపింది. కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. దేశంలో ఇంకా ఎంతోమంది వన్డే, టీ20 స్పెషలిస్టులు అందుబాటులో ఉండటంతో వారితో ఒక జట్టును ఎంపిక చేసి శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ ఆడించడానికి బీసీసీఐ నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంక బోర్డు దీన్ని మహాప్రసాదంగా భావించింది. ఈ సిరీస్ ద్వారా వారికి రూ.70 కోట్ల ఆదాయం రానుండటం విశేషం.

ఇంకొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో ఆ టోర్నీలో ఆడబోయే చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుందని కూడా బీసీసీఐ భావించింది. ఐతే కోహ్లీ నేతృత్వంలో ఓ జట్టు ఇంగ్లాండ్‌లో ఉండగా.. తమ దేశానికి ఓ ద్వితీయ శ్రేణి జట్టును బీసీసీఐ పంపుతోందని.. ఇది తమకు అవమానకరమని రణతుంగ వ్యాఖ్యానించాడు. కాసుల కోసం శ్రీలంక బోర్డు కక్కుర్తి పడుతోందని కూడా వ్యాఖ్యానించాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు భారత్, శ్రీలంక మధ్య తొలి వన్డే పూర్తయింది. లంక అతి కష్టం మీద 262 పరుగులు చేస్తే.. ఇంకో 80 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం సొంతం చేసుకుంది భారత్. పృథ్వీ షా, ఇషాన్ కిషన్ లాంటి పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లు లంక బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయారు. వారి ముందు లంకేయులు గల్లీ బౌలర్లలా కనిపించారు.

ధావన్ సేనను రణతుంగ సెకండ్ గ్రేడ్ టీం అన్నాడు కానీ.. నిజానికి మన జట్టు ముందు శ్రీలంక థర్డ్ గ్రేడ్ టీం లాగా కనిపించింది. ఈ సిరీస్ అంతా కూడా భారత్‌ ఆధిపత్యం సాగడం ఖాయమని తేలిపోయింది. ఐపీఎల్‌తో రాటుదేలిపోయిన కుర్రాళ్ల ముందు లంకేయులు ఏమాత్రం నిలిచే పరిస్థితి లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రణతుంగను మామూలుగా ఆడుకోవట్లేదు భారత ఫ్యాన్స్. ఆయన మీద ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు.