అస్త్రాలు సిద్ధం చేసుకున్న టీడీపీ..

సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్న పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగ‌నుం దని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏపీ ప్ర‌బుత్వ వైఫ‌ల్యాల‌ను పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌శ్నించేందుకు టీడీపీ ఎంపీలు అస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. వైసీపీని నిల‌దీయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య పార్ల‌మెంటు వేదిక‌గా వాగ్యుద్ధం జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఈ సమావేశంలో 29 బిల్లులు, 2 ఆర్థిక అంశాలపై చర్చ జరపాలని కేంద్రానికి టీడీపీ ప్రతిపాదనలు పంపింది. కొవిడ్ పరిస్థితులు, ఎంపీ లాడ్స్పై చర్చ జరపాలని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో ఏపీకి సంబంధించిన‌ ప్రత్యేక హోదా, విభజన హామీలపై సైతం చర్చించాలని ప‌ట్టుబ‌ట్ట‌నున్నారు. సాగునీటి ప్రాజెక్టులపై అటు తెలంగాణను, ఇటు కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో రాష్ట్రం ఉంద‌న్న నేప‌థ్యంలో ఈ అంశాన్ని కూడా టీడీపీ గ‌ట్టిగా పార్ల‌మెంటులో నిల‌దీయాల‌ని నిర్ణ‌యించుకుంది.

అదేస‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని పార్ల‌మెంటు వేదిక‌గా టీడీపీ ఎంపీలు ప్ర‌శ్నించ‌నున్నారు. జీతాలు సైతం చెల్లించలేని స్థితిలో ఉండ‌డాన్ని పార్ల‌మెంటు దృష్టికి తీసుకువెళ్లి సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేయ‌నున్నారు. దేవాలయాలపై దాడుల వ్యవహారంలో దర్యాప్తు, రాజద్రోహం 124ఏ సెక్షన్ దుర్వినియోగం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించ‌డాన్ని బ‌ట్టి.. పార్ల‌మెంటులో ఆయా అంశాలు కూడా చ‌ర్చ‌కు రానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, రైతు ఉద్యమం, పంటలకు మద్దతు ధరపై చర్చ జరపాలని కేంద్రంపైనా ఒత్తిడి తేనున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్ర‌త్యేకంగా ఇవ్వ‌నున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు అవసరమైతే టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయటానికైనా సిద్ధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి రాష్ట్రం కోసం పోరాడాలనే నినాదాన్ని పార్లమెంటులో ప్ర‌స్తావించి ఒత్తిడి తేనున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీకి టీడీపీ ఎంపీలు పార్ల‌మెంటు వేదిక‌గా గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుండ‌డం గ‌మ‌నార్హం.