ఆ మూడు కార్పొరేష‌న్లూ.. రెడ్ల‌కే.. రీజ‌నేంటి?

రాష్ట్రంలో జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని.. మ‌హిళా సాధికార‌త‌కు ఇవి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్న స‌ర్కారు.. వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుల‌ పై విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

మొత్తం కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని చెబుతున్నా.. ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చామ‌ని చెప్పుకొంటున్నా.. కీల‌క‌మైన ప‌దవుల‌ను మాత్రం త‌న సొంత సామాజిక వ‌ర్గానికే అప్ప‌గించార‌ని.. సీఎం జ‌గ‌న్‌పై ఇటు రాజ‌కీయంగా.. అటు సోష‌ల్ మీడియా ప‌రంగా కూడా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో మూడు కీల‌క‌మైన వాటిని చూసుకుంటే.. వీటిని మ‌హిళ‌ల‌కు కాకుండా.. పురుషుల‌కే కేటాయించారు. అది కూడా రెడ్డి సామాజిక వ‌ర్గానికి కేటాయించారు. రాష్ట్రంలో కీల‌క‌మైన‌.. ఏపీఐఐసీ చైర్మ‌న్, టీటీడీ చైర్మ‌న్‌, మారిటైం బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను రెడ్డి సామాజిక వ‌ర్గానికే కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

తిరుమ‌ల తిరుప‌తి బోర్డు చైర్మ‌న్‌గా నిన్న మొన్న‌టి వ‌రకు జ‌గ‌న్ సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డే ఉన్నారు. అయితే.. బోర్డు కాల ప‌రిమితి ముగియ‌డంతో ఆయ‌న‌ను త‌ప్పించినా.. వెంట‌నే మ‌ళ్లీ ఆయ‌న‌కే ప‌గ్గాలు అప్ప‌గించారు. వాస్త‌వానికి దీనిని చంద్ర‌బాబు గ‌తంలో బీసీ వ‌ర్గానికి కేటాయించి.. మంచి సంప్ర‌దాయానికి నాందిప‌లికార‌నే వాద‌న ఉంది.

ఈ క్ర‌మంలో టీటీడీ బోర్డు విష‌యంలో ఈ ద‌ఫా.. జ‌గ‌న్ బీసీ వ‌ర్గానికి కేటాయిస్తార‌ని అనుకున్నా.. మ‌రోసారి బాబాయికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇక‌, ఏపీఐఐసీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు రెడ్డి సామాజిక వ‌ర్గానికిచెందిన‌.. రోజా ఉన్నారు. అయితే.. ఆమెను త‌ప్పించారు. ఈ క్ర‌మంలో దీనిని ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు కేటాయిస్తార‌ని అనుకున్నా.. మ‌ళ్లీ దీనిని రెడ్డి వ‌ర్గానికే అందునా పురుష అభ్య‌ర్థికే కేటాయించ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిని మెట్లు గోవింద రెడ్డికి క‌ట్ట‌బెట్టారు. ఇక‌, మ‌రో కీల‌క‌మైన ఆదాయం వ‌చ్చే రంగం.. మారిటైం బోర్డు. దీనికి కూడా చైర్మ‌న్‌గా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌ట‌రెడ్డిని నియ‌మించారు.

దీంతో అత్యంత కీల‌క‌మైన మూడు రంగాల‌కూ జ‌గ‌న్‌.. త‌న సొంత సామాజిక‌వ ర్గాన్నే కేటాయించ‌డం స‌రికాద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనిపై వైసీపీ నేత‌లు ఏమంటారో చూడాలి. అయితే.. రెడ్డి సామాజిక వ‌ర్గ‌మైతేనే త‌న‌కు న‌మ్మ‌కంగా ఉంటుంద‌ని.. లేదా త‌ను చెప్పిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలుస్తోంద‌ని.. అందుకే వారికే కేటాయించార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. సామాజిక న్యాయం చేశామంటున్నా.. కీల‌క ప‌ద‌వుల‌ను మాత్రం రెడ్డి వ‌ర్గానికి కేటాయించ‌డంపై మాత్రం విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.